అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) వద్ద మరోసారి విషవాయువు లీక్ ఘటన కలకలం రేపింది. మంగళవారం ఇక్కడి బ్రాండిక్స్ ఇండియా అప్పారెల్ సిటీలో ఉన్న సీడ్స్ ఇంటిమేట్ అపెరల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ ఘటన జరిగింది. ఈ వస్త్రాల తయారీ యూనిట్లో పనిచేస్తున్న 100 మందికి పైగా మహిళా ఉద్యోగులు ఈ విషవాయువు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ సెజ్లో రెండు నెలల వ్యవధిలో గ్యాస్ లీక్ జరగడం ఇది రెండోసారి. అయితే విషవాయువు లీక్ కావడంతో మహిళా కార్మికులు కళ్ళు మంటలు, వాంతులు, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో వెంటనే అంబులెన్సులను రప్పించి వారిని హుటాహుటిన అనకాపల్లి పట్టణం లోని ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. వీరిలో కనీసం ఐదుగురు మహిళలు వెంటిలేటర్ సపోర్టులో ఉన్నారని, ఇతరుల పరిస్థితి కొంత నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
కాగా దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక ఈ ఘటనపై జిల్లా పోలీసు చీఫ్ గౌతమి షాలీ స్పందిస్తూ.. మంగళవారం మధ్యాహ్న షిఫ్ట్లో 2,000 మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారని, అయితే సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో గ్యాస్ లీకేజీ అవుతున్నట్లు సిబ్బంది గమనించారని, ఈ లోపే పలువురు కార్మికులు స్పృహ తప్పి పడిపోయారని వివరించారు. వెంటనే కంపెనీకి చెందిన వైద్య సిబ్బంది కొందరికి ప్రాథమిక చికిత్స అందించారని, అనంతరం అంబులెన్సులలో అనకాపల్లి లోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి మరియు పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారని తెలిపారు. కాగా అసలు ఎక్కడి నుంచి ఈ గ్యాస్ లీక్ అయిందనే సమాచారం ఇంకా అధికారులు గుర్తించలేదని, దీనిపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. మరోవిప్పు అచ్యుతాపురం సెజ్ ఘటనపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి కలెక్టర్ రవి పట్టాన్శెట్టితో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY