కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ రోజు మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మే 29 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు వెల్లడించారు. రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1096 కి చేరిందని, వీరిలో 29 మంది మృతి చెందగా 628 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఈ ఒక్కరోజే 43 మంది డిశ్చార్జ్ అయినట్టు చెప్పారు. ప్రస్తుతం 439 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులు పాటించాల్సి ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 35 కంటైన్మెంట్ జోన్స్ ఉండగా, 19 హైదరాబాద్ లో, 16 ఇతర రెడ్ జోన్ జిల్లాల్లో ఉన్నాయని చెప్పారు.
సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
- తెలంగాణలో 6 జిల్లాలు రెడ్జోన్లో, 9 జిల్లాలు గ్రీన్జోన్ లో, 18 జిల్లాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయి.
- లాక్డౌన్ 3.0 లో భాగంగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు పాటిస్తాం.
- గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లాక్డౌన్ అమలులో సడలింపులు ఇస్తాం.
- గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉ.10 నుంచి సా.6 వరకు మాత్రమే షాపులకు అనుమతి.
- రెడ్ జోన్స్ ప్రాంతాల్లో కిరాణా షాపులు, సూపర్ మార్కెట్స్, మెడికల్ షాప్స్, సిమెంట్, ఎలక్ట్రికల్, హార్డ్వేర్, స్టీల్ షాపులకు తప్ప ఇంకా ఎలాంటి మినహాయింపులు ఉండవని చెప్పారు.
- మండల కేంద్రం, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని షాపులకు అనుమతి.
- మున్సిపాలిటీల్లో 50 శాతం షాపులకు మాత్రమే అనుమతి.
- జోన్లతో సంబంధం లేకుండా మే 29 వరకూ రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ.
- ప్రజలు లాక్డౌన్ కు సహకరించాలి, వివిధ జబ్బులతో చికిత్స పొందుతున్నవారు, పెద్దలు బయటకు రావొద్దని విజ్ఞప్తి.
- దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారికీ కోటి మాస్కులు ఉచితంగా పంపిణీ చేస్తాం.
- రాష్ట్రంలో వ్యవసాయరంగ పనులు కొనసాగుతాయి.
- రవాణా రంగానికి సంబంధించిన ఆఫీస్లు తెరుచుకోవచ్చు. వాహనాల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.
- స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వందశాతం సిబ్బందితో పనిచేస్తుంది. భూములు అమ్మకాలు, కొనుగోళ్లు మొదలవుతాయి.
- మధ్యలో ఆగిపోయిన పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్షల నిర్వహణలో హైకోర్టు ఆదేశాలు పాటిస్తాం. మే నెలలోనే పరీక్షలు పూర్తి చేసే అవకాశముంది.
- ఇంటర్ పరీక్షలు వాల్యువేషన్ జరిపించి, ఫలితాలు విడుదల చేస్తాం.
- న్యాయవాదుల కోసం 25కోట్లతో నిధి ఏర్పాటు. పేద న్యాయవాదులకు సహాయం చేస్తాం.
- రాష్ట్రంలో రేపటి నుంచి (మే 6, బుధవారం) మద్యం షాపులు తెరవడానికి అనుమతి.
- ఉదయం 10 నుంచి సాయంత్రం 6 దాకా మద్యం షాపులు తెరచి ఉంటాయి.
- మద్యం ధరలు పెంపు, చీప్ లిక్కర్పై 11 శాతం, మరికొన్ని రకాలపై 16 శాతం పెంపు.
- షాపుల వద్ద భౌతిక దూరం పాటించకపోతే అనుమతులు రద్దు చేస్తాం.
- రెడ్ జోన్లలో కూడా మద్యం షాపులు ఓపెన్.
- 15 కంటెన్మెంట్ జోన్స్ పరిధిలో మద్యం షాపులకు అనుమతి లేదు.
- బార్లు, పబ్లు, క్లబ్బులకు అనుమతి లేదు.
- వలస కూలీలను ఆదుకుంటాం, తెలంగాణా నుంచి 13రైళ్లు బయల్దేరాయి, ట్రైన్ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
- రైతు బంధు వందశాతం అందరికీ ఇస్తాం.
- 25వేల రుణం ఉన్నవారికి ఒకే దఫా రుణమాఫి కోసం 1200 కోట్లు రేపే విడుదల చేస్తున్నాం.
- కేసీఆర్ ఉన్నంతవరకు రైతుబందు కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu