వాతావరణ సమతుల్యతకు, భావితరాలకు ఆరోగ్య కరమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ.జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో దేవర కొండ రోడ్డు మీడియన్ లో సెయింట్ అల్ఫోన్స్ ఉన్నత పాఠశాల వద్ద ‘ఒక రోజు ఒక లక్ష మొక్కలు నాటే మెగా ప్లాంటేషన్’ కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి మొక్క నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవరకొండ రోడ్డు వద్ద జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మానవుడు ఆరోగ్యంగా జీవించడానికి చుట్టూ అనువైన పరిస్థితులు ముఖ్యంగా చెట్ల నుండి వచ్చే ఆక్సిజన్ అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కొన్ని దేశాలలో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితులు వున్నాయని అన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు మంచి నీరు కొనుక్కునే పరిస్థితి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన భగీరథ ద్వారా అందరికీ స్వచ్ఛమైన త్రాగు నీరు సరఫరా జరుగుతోందని తెలిపారు. చెట్లు,అడవులు నశించి పోవటం వలనే వాతావరణ కాలుష్యం తో అనారోగ్య సమస్యలకు శ్వాస సంబంధిత జబ్బులకు మానవుడు గురవుతున్నట్లు తెలిపారు. పరిశ్రమలు,మోటార్ వాహనాల నుండి వచ్చే వాయి ఇతర కాలుష్యం నివారించి ఆక్సిజన్ పొందుటకు ప్రతి ఒక్కరూ 6 మొక్కలు నాటి వాటిని పెరిగే వరకు సంరక్షించాలని అన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన తెలంగాణకు హరిత హరం కార్యక్రమం ద్వారా గత 8 సంవత్సరాలుగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందిస్తున్నట్లు తెలిపారు.
2015 సంవత్సరంకు ముందు నల్గొండ పట్టణంలో నాటిన మొక్కలు 12 లక్షల 15 వేల 936 కాగా, హరిత హరం కార్యక్రమం ద్వారా 2015-16 నుండి 8 సంవత్సరాల్లో నేటి వరకు నల్గొండ పట్టణంలోనే 15 లక్షల 52 వేల 470 మొక్కలు నాటినట్లు మంత్రి వెల్లడించారు. 2022-23 సంవత్సరంలో 3 లక్షల ఒక వేయి 284 మొక్కలు నాటి నట్లు, సోమవారం ఒక రోజు ఒక లక్ష 16 వేల 500 మొక్కలు నాటే మెగా ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టి నట్లు తెలిపారు. మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో బాగంగా పట్టణం లో ఎస్.టి.పి లెప్రసీ కాలనీ శేషమ్మ గూడెంలో బ్లాక్ ప్లాంటేషన్ ద్వారా 20 వేల మొక్కలు, పానగల్ ముత్యాలమ్మ దేవాలయం వద్ద బ్లాక్ ప్లాంటేషన్ లో వేయి మొక్కలు, బక్కతాయికుంట లో 4 వేల మొక్కలు, ఎస్.ఎల్.బి.సి వద్ద ఖాళీ స్థలంలో 20 వేల మొక్కలు, రైల్వే స్టేషన్ వద్ద 12 వేల మొక్కలు, నీలగిరి పార్కు, నందనవనంలో 6500 మొక్కలు, దేవరకొండ రోడ్డు మధ్యన మీడియన్ పై 18 వేల మొక్కలు, కేశరాజు పల్లి రహదారి మధ్య మీడియన్ పై 18 వేల మొక్కలు, నామ్ రోడ్డు 2 రహదారి ఇరువైపులా వెయ్యి ముక్కలు, గిరకబావి గూడెం రహదారి, మునుగోడు హౌసింగ్ బోర్డు రోడ్డు పై 6 వేల మొక్కలు, నామ్ రోడ్డు 2 రహదారిపై అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా 10 వేల మొక్కలు నాటుతున్నట్లు మంత్రి తెలిపారు.
2014 కు ముందు పట్టణం లో 17 శాతం గ్రీన్ కవర్ వుంటే, హరిత హరం కార్యక్రమం ద్వారా నాటిన మొక్కల ద్వారా 2022-23 నాటికీ 23 శాతం గ్రీన్ కవర్ విస్తీర్ణం పెరిగిందని మంత్రి వివరించారు. కెనడా దేశంలో ఒక మనిషికి 6 వేల చెట్లు వుంటే, అమెరికా లో ఒక మనిషికి 3 వేల చెట్లు వున్నాయని వాతావరణ పరిస్థితులు బాగున్నాయని అన్నారు. భూ భాగంలో 33 శాతం అడవులు వుండాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నల్గొండ పట్టణంలో రహదారులు, త్రాగు నీరు, ఇతర సదుపాయాలు, మౌలిక వసతులకు రూ.1041 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో గ్రామాలు, పట్టణంలలో మొక్కల పెంపకం, స్మశాన వాటికలు, రహదారులు, డ్రెయినేజీ కాలువలు, ఆట స్థలాలు, పాఠశాలలు, కళాశాలలు, వైద్య సదపాయాలు వంటి సౌకర్యాలు కల్పించామని, ప్రజలు ఆ సౌకర్యాలు వినియోగించుకొవాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.
నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ముందు చూపుతో హరిత హరం కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సీఎం ఆశీస్సు లతో నల్గొండ పట్టణంలో రహదారులు, జంక్షన్ లు, డ్రైనేజీ, ఇతర పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. అభివృద్ది పనులు సౌకర్యాలతో పాటు వాతావరణ సమతుల్యత కు మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం ఓ.ఎస్.డి(హరిత హరం) ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా, అటవీ శాఖ కన్జర్వేటర్ శివానీ డోగ్రా, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లి కార్జున్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ యం.సైది రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్, మున్సిపల్ కమిషనర్ డా.కె.వి.రమణా చారి, డి.ఎఫ్.ఓ రాంబాబు, ఎం.పి.పి.లు, కౌన్సిలర్ లు,అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE