ఏపీ రాజధానితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులకు.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టేలా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రాజధాని పనులు మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళికలు రచించిన ఏపీ ప్రభుత్వం..ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు ప్రారంభించి దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏఫ్రిల్ 15న ఏపీలో పర్యటించి.. రాజధాని పునః ప్రారంభ పనులకు హాజరుకానున్నారు.
ఇప్పటికే 40 వేల కోట్ల రూపాయల పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అలాగే అమరావతి స్వయం పోషక ప్రాజెక్టు అని చెప్తోన్న ఏపీ ప్రభుత్వం.. ప్రజాధనంతో ఈ రాజధానిని నిర్మించడం లేదని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 2015 అక్టోబర్ 21లోనే అమరావతికి ప్రధాని మోదీ తొలిసారి శంకుస్థాపన చేసినా..అప్పుడు వైసీపీ ప్రభుత్వం రావడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో మరోసారి పునః ప్రారంభ పనులకు తేదీని ఖరారు చేశారు.
రాజధాని పునఃప్రారంభం ద్వారా ఏపీలో లక్ష కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి, సీఆర్డీఏ ఇప్పటికే సమగ్ర ప్రణాళికను కూడా రూపొందించింది. మొత్తం 62,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్మాణ పనులను మూడేళ్లలో పూర్తి చేయడానికి సంకల్పించింది.
ప్రధాని పర్యటన సందర్భంగా అమరావతి నిర్మాణ పనుల కోసం శంకుస్థాపనతో పాటు ఏపీ వ్యాప్తంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ చేతుల మీదుగా ప్రారంభం చేయాలని దీంతో.. దేశవ్యాప్తంగా ఏపీ మరింత గుర్తింపు పొందాలని ప్రభుత్వం ఆశిస్తోంది. వచ్చే నెల ప్రధాని పర్యటనను విజయవంతం చేయడానికి మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని పర్యటన ద్వారా అమరావతి నిర్మాణ పనులు వేగవంతం అయితే.. రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలకమైన అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.