ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిచేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండ్రోజుల క్రితం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మే 21, గురువారం ఉదయం 6 గంటల నుంచి ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే బస్సుల్లో ప్రయాణానికి ఆన్లైన్లో మాత్రమే టికెట్ బుకింగ్కు అవకాశం కల్పించారు. సూపర్ లగ్జరీ సర్వీసులకే కాకుండా ఆర్డినరీ బస్సులకు కూడా ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. బస్సు నడిచే రూట్లపై ఏపీఎస్ఆర్టీసీ ఈ రోజు పూర్తి వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బస్సులు నడిపే విషయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక సూచనలు చేశారు. ఆర్టీసీ బస్సులుతో పాటుగా ప్రైవేటు బస్సులకూ అనుమతులు ఇవ్వాలని చెప్పారు. ఒక్కో బస్సులో కేవలం 20 మందినే అనుమతించాలని ఆదేశాలు ఇచ్చారు. బస్సు ప్రయాణంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ, ప్రయాణికులందరూ మాస్క్ ధరించేలా చూడాలని పేర్కొన్నారు.
ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలకు కరోనా నిబంధనలు అనుసరించి పలు మార్పులు చేశారు. ముందుగా భౌతిక దూరం పాటించేలా సీట్లలో మార్పులు చేశారు. అలాగే బస్సు సర్వీసులను జిల్లాలు, డిపోల మధ్య మాత్రమే నడపనున్నారు. మధ్యలో బస్సులు ఆపడం, ప్రయాణికులను ఎక్కించుకునే విధానాన్ని కొంతకాలం అనుమతించకూడదని నిర్ణయించారు. ప్రయాణికులంతా తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని చెప్పారు. ఆన్లైన్లోనే రిజర్వేషన్ చేసుకున్నవారినే అనుమతిస్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, 10 ఏళ్ల లోపు చిన్న పిల్లలను కేవలం అత్యవసర పనులు, వైద్య సేవల నిమిత్త ప్రయాణాలకు మాత్రమే అనుమతిస్తారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu