కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ 4.0 కు సంబంధించి కేంద్రప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో దేశంలో కంటైన్మెంట్ జోన్ ప్రాంతాల మినహా బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు అనుమతిచ్చారు గాని, ప్రయాణికుల రైళ్లు, దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. భారతీయ రైల్వే జూన్ 1 వ తేదీ నుంచి రోజువారీగా 200 నాన్-ఏసీ రైళ్లను నడపనుందని తెలిపారు. ఈ రైళ్లలో బుకింగ్స్ అతి త్వరలోనే ఆన్లైన్లో ప్రారంభమవుతాయని చెప్పారు.
జూన్ 1 నుంచి మొదలయ్యే 200 పాసెంజర్ రైళ్లపై రైల్వే శాఖ కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించింది. ఈ రైళ్లు రాకపోకలు సాగించే మార్గాలు షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని రైల్వే శాఖ తెలిపింది. ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకున్న వారికే రైలు ప్రయాణానికి అవకాశం ఉంటుందని, కౌంటర్ల ద్వారా టికెట్ తీసుకోవడం/బుకింగ్ సదుపాయం లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. దేశంలో చిన్న నగరాలు మరియు పట్టణాల ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చేందుకు ఈ రైళ్లు నడపబోతున్నట్టు తెలిపారు. మరో వైపు వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలింపు కోసం ప్రస్తుతం నడిపే 200 శ్రామిక్ రైళ్లతో పాటుగా మరో 200 రైళ్లను కూడా నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu