కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31వ తేదీ వరకు విధించిన లాక్డౌన్ 4.0 అమలులో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఇటీవలే కీలక సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత రెండు నెలలుగా తెలుగు చిత్ర పరిశ్రమ (టాలీవుడ్) కార్యకలాపాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. షూటింగ్స్ ఆగిపోవడం, థియేటర్స్ మూతపడడం, సినిమా రంగంలో అన్ని పనులు ఆగిపోవడంతో సినీ పరిశ్రమనే ఉపాధిగా చేసుకుని ఆధారపడ్డ వేల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మే 21, గురువారం ఉదయం ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి నివాసంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సమావేశమయ్యారు.
సినీ పరిశ్రమకు సంబంధించి ఎలాంటి లాక్డౌన్ సడలింపుల ఇవ్వాలి, షూటింగ్స్ ప్రారంభించడం, థియేటర్స్ తెరవడం, సినిమా రంగంపై తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నట్టు సమాచారం. కరోనా వలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి తో పాటుగా నటుడు నాగార్జున, నిర్మాతలు సురేష్బాబు, అల్లు అరవింద్, దిల్రాజు, జెమిని కిరణ్, సి.కల్యాణ్, శ్యామ్ప్రసాద్రెడ్డి, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, వి.వి వినాయక్, ఎన్.శంకర్, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu