బిహార్ ముఖ్యమంత్రిగా మరోసారి నితీశ్ కుమార్ నేడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హాజరవుతున్నారు. టీడీపీ, జేడీయూ రెండూ కేంద్రంలోని ఎన్డీయేలో కీలక భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు నేతలకు ఆహ్వానం అందడంతో వారు గురువారం (నవంబర్ 20) ఉదయం ఎనిమిది గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి పాట్నాకు పయనమయ్యారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడ బయలుదేరి తిరిగి మూడు గంటలకు అమరావతికి చేరుకుంటారు.
అయితే, మరోవైపు ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు కూడా ఆహ్వానం అందింది. అయినప్పటికీ, వ్యక్తిగత కారణాల దృష్ట్యా పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా, ఇది నితీశ్ కుమార్ రికార్డు స్థాయిలో 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భం. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సహా పలువురు జాతీయ స్థాయి ప్రముఖులు హాజరవుతున్నారు.







































