ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, రాష్ట్ర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రదర్శించిన 16 శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని చెప్పారు. ప్రజలకు మేలు జరిగేలా నవరత్నాలు అమలు జరుగుతున్నాయన్నారు. పాఠశాలల్లో నాడు-నేడుతో అభివృద్ధి, జగనన్న అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియంలో విద్య, జగనన్న విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద పథకాల ద్వారా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను కూడా ప్రభుత్వం నెరవేస్తుందన్నారు. ఏపీలో రైతు భరోసా కేంద్రాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, వ్యవసాయ రంగంలో పురోగాభివృద్దితో ముందుకెళ్తున్నామని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ