ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. జగన్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని కలిసిన ఈ మూడు పార్టీలూ.. జగన్ ను విమర్శించడంలో కూడా ఒకటే మాటపై నిలబడుతున్నాయి. జగన్ అవినీతి అక్రమాలపై విమర్శలు చేయడం కాకుండా, సభలు, సమావేశాల్లో ఆయన మాట్లాడిన తీరుపైనా ఒకే విధంగా స్పందిస్తున్నాయి. పలు సభల్లో కొందరు అభ్యర్థులను ఉద్దేశించి.. కష్టపడతాడు.. మంచోడు.. డబ్బుల.. విషయంలో పేదోడు అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొనడంపై సెటైరికల్గా మాట్లాడుతున్నారు.
ఓ పక్క చంద్రబాబునాయుడు, మరో పక్క పవన్ కల్యాణ్ కూడా జగన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ‘ఫ్యాన్కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ. వైసీపీ కావాలా.. కూటమి కావాలా.. ప్రజలంతా ఆలోచించాలి. అధికారం అండతో ఇసుక, మద్యంలో వందలకోట్లు కొట్టేసిన వైసీపీ అవినీతి గురించి మాట్లాడుతోంది. జగన్ అవినీతి చేయలేదని చెప్పగలరా? అంటూ పిఠాపురంలో పవన్ కల్యాణ్ అన్నారు. ఆ పార్టీలో ఒక్కో ఎమ్మెల్యే కోట్లలో సంపాదించారు. కానీ, జగన్ మాత్రం తమ అభ్యర్థి ఆస్తి అంతంతే అంటున్నారు. అంతంతే అంటే ఎంత? సాక్షి పత్రిక పేదదా? భారతి సిమెంట్ పేదదా? సజ్జల పేద వ్యక్తా? 60 నియోజకవర్గాలపై పడి దోచుకున్న ఎంపీ మిథున్రెడ్డి పేదోడా? రూ.20వేల కోట్ల అక్రమార్జన చేసిన జగన్ పేదోడా? రూ.600 కోట్లు సిద్ధం సభలకు ఖర్చు చేసిన వాళ్లు పేదోళ్లా? ఇసుకలో జేపీ సంస్థ పేరుతో, బినామీ పేర్లతో కోట్లు కొట్టేసిన జగన్ పేదోడా? అంటూ పవన్ ధ్వజమెత్తారు.
మరోవైపు.. మార్కాపురం తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ప్రజాగళం సభల్లో కూడా చంద్రబాబునాయుడు అవే వ్యాఖ్యలను ప్రచారంలో భాగంగా ఉపయోగించారు. వేల కోట్లు తిన్న జగన్ పేదోడా అని ప్రశ్నించారు. ‘ఒకపక్క ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా అంటుంటే.. రాష్ట్రంలో జగన్ మద్యాన్ని నగదులోనే విక్రయిస్తున్నారు. రోజుకు రాష్ట్రంలో రూ.70కోట్ల మద్యం విక్రయాలు జరుగుతుంటే అందులో రూ.1.50 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీలు. మరి మిగిలిన అన్ని కోట్లు ఎక్కడికిపోతున్నాయో అంతా ఆలోచించాలి. సీఎం తన సొంత మనుషులకు చెందిన 16 మద్యం కంపెనీలతో కుమ్మక్కయ్యారు. ఇప్పటివరకు రూ.20వేలకోట్లు మద్యం డబ్బు జగన్ జేబుల్లోకి వెళ్లాయి. అసలు మద్యపాన నిషేధం అమలు చేద్దామా.. వద్దా? ప్రజలంతా చెప్పాలి.. అంటూ ప్రచారంలో జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కూటమి పేరుతో ఒక్కటైనందుకు.. జగన్ ను కూడా ఒకే అంశంపై విమర్శిస్తూ.. ప్రచారాన్ని రక్తికట్టిస్తున్నారు. 160 సీట్లు సాధించాలన్న కసితో అటు పవన్.. ఇటు చంద్రబాబు ఎన్నికల సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు భువనేశ్వరి, లోకేశ్ కూడా ప్రచారం సాగిస్తూ.. కూటమికి బలం చేకూరుస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY