తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్రమంత్రివర్గం అక్టోబర్ 1, మంగళవారం సాయంత్రం సమావేశం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్ లో జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో నూతనంగా రూపొందించిన రెవెన్యూ చట్టం, నూతన సచివాలయ నిర్మాణం, ఆర్టీసీ సమ్మె అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. నూతన రెవిన్యూ చట్టానికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఇప్పటికే తీవ్ర కసరత్తు చేస్తున్నారు, మంత్రివర్గంలో చర్చించి ఈ ముసాయిదాపై నిర్ణయం తీసుకోబోతున్నారు.
ఇప్పటికే సచివాలయం తరలింపు పూర్తికావడంతో, పాత భవనాల కూల్చివేతపై చర్చించనున్నారు. కొత్త సచివాలయం నిర్మాణ విషయాలపై నిర్ణయం తీసుకోనున్నారు. మరో వైపు దసరా పండుగ సమయంలో అక్టోబర్ 5వ తేదీ నుంచి టిఎస్ఆర్టీసీ సమ్మెకు దిగబోతున్నట్టు ప్రకటించడంతో, సమ్మె నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, కార్మికుల డిమాండ్లపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుండడంతో ఈ అంశంపై ప్రధానంగా చర్చించబోతున్నట్టు తెలుస్తుంది.
[subscribe]