అనకాపల్లిలో గ్యాస్ లీకేజీ ఘటనలో రెండు కంపెనీలలో ఉత్పత్తిని నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 3న జరిగిన గ్యాస్ లీక్ వల్ల 178 మంది కార్మికులు స్పృహ తప్పి పడిపోయారు. అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ ఇండియా ఫ్యాక్టరీలో వెలువడిన విషవాయువును పీల్చి కెమికల్ ప్లాంట్లో పనిచేస్తున్న మహిళలు అపస్మారక స్థితికి చేరుకున్నారు. తాజా సమాచారం ప్రకారం దీనికి సమీపం లోని పోరస్ ల్యాబ్స్ నుంచి కూడా గ్యాస్ లీక్ అయ్యిఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో బ్రాండిక్స్ ఇండియాతో సహా పోరస్ ల్యాబ్స్ రెండింటిలో పూర్తిగా ఉత్పత్తిని నిలిపివేస్తన్నామని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెల్లడించారు.
పోరస్ లేబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కొన్ని నమూనాలను తీసుకొని విశ్లేషణ కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్కు పంపించామని, నివేదిక వచ్చిన అనంతరం కంపెనీలపై తదుపరి చర్యలు ఉంటాయని వారు పేర్కొన్నారు. అనకాపల్లి కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఒకరు ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఇక్కడ పోరస్ అనే వెటర్నరీ డ్రగ్స్ కంపెనీ ఉంది. ఆ పక్కనే బ్రాండిక్స్ అనే అప్పెరల్ కంపెనీ 1000 ఎకరాల్లో ఉంది. ఆ క్యాంపస్లో సీడ్స్ అపెరల్ ఇండియా అనే మరో కంపెనీ ఉంది. వీటిలో సుమారు 1800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
అయితే ఘటన జరిగిన రోజు పోరస్ కంపెనీకి చెందిన స్క్రబ్బర్ ప్రాంతంలో చిన్న లీకేజీ ఏర్పడింది, ఇది పక్కనే ఉన్న బ్రాండిక్స్ ఇండియా అపెరల్ కంపెనీలో అమ్మోనియా గ్యాస్ లీకేజీకి దారితీసి ఉండొచ్చని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత, గ్యాస్ లీక్ ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా కలెక్టర్తో సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF