ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఈరోజు జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో వంద మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్ఈజడ్లోని సీడ్స్ యూనిట్లో గ్యాస్ లీక్ అవడంతో సీడ్ కంపెనీ ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే గ్యాస్ లీకేజీని వెంటనే అదుపులోకి తీసుకురాలేక పోవడంతో యూనిట్ లోని సిబ్బందితో పాటు చుట్టుపక్కల ప్రజలు మొత్తం వంద మందికి పైగా వాంతులు, కళ్ల మంటలు, తల తిరగడం వంటి లక్షణాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారిలో కొందరు తలతిరిగి పడిపోవడంతో హుటాహుటిన బ్రాండిక్స్ ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఘటనకు గల కారణాలను సీఎంఓ అధికారులు ఆయనకు వివరించారు. సెజ్ పరిధిలోని పోరస్ కంపెనీ నుంచి అమ్మోనియా వాయువు లీక్ అయినట్లు అధికారులు ఆయనకు సమాచారం ఇచ్చారు. జిల్లా కలెక్టర్ దీనిపై వెంటనే స్పందించి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని, గ్యాస్ లీకేజీని కంట్రోల్ చేశారని సీఎంకు తెలిపారు. అస్వస్థతకు గురైన వారిని బ్రాండిక్స్ లోని ఆస్పత్రికి తరలించారని, యూనిట్లో పనిచేస్తున్న మహిళలను అందరిని ఖాళీ చేయించారని వెల్లడించారు. అయితే సీఎం దీనిపై స్పందిస్తూ.. అనారోగ్యానికి గురైన వారికి మంచి వైద్యాన్ని అందించాలని, మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. అలాగే ఘటనా స్థలానికి వెళ్లాలని, సహాయ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ను సీఎం ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF