ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం సన్నాహకాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను సంతృప్తస్థాయిలో పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ సందర్భంగా స్పందన కార్యక్రమంలో భాగంగా అత్యధిక అర్జీలు అందుకుంటున్న ప్రభుత్వ విభాగ అధిపతులతో సీఎం సమీక్ష జరిపారు. అర్జీల పరిష్కారంలో అనుసరించాల్సిన విధానాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభానికి సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి ప్రభుత్వ విభాగాధిపతి ప్రతి వినతిని పరిష్కారం అయ్యేంతవరకూ ట్రాక్ చేయాలని, అందిన అర్జీలపై ప్రతి వారం కూడా ఆడిట్ చేయాలని చెప్పారు. దీనిపై ప్రతి వారం కూడా నివేదికలు తీసుకోవాలి. ట్రాకింగ్, పర్యవేక్షణ జరుగుతుందా?, లేదా? అన్నదానిపై ప్రతివారం కూడా సమీక్ష చేయాలని చెప్పారు. “వివిధ ప్రభుత్వ విభాగాల్లో అర్జీలు, ఫిర్యాదుల స్వీకరణకు ఇప్పటికే ఉన్న కాల్ సెంటర్లను అనుసంధానం చేయాలి. వివిధ విభాగాల్లో వినతుల పరిష్కారం కోసం ఇప్పటివరకూ ఉన్న పద్ధతులను మరోసారి పరిశీలించి, తిరిగి పునర్నిర్మాణం చేయాలి. సీఎంఓతో పాటు ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా జగనన్నకు చెబుదాం ప్రాజెక్ట్ మానిటరింగ్ విభాగాలు ఉండాలి. తర్వాత జిల్లాస్థాయిలోనూ, మండలస్థాయిలో కూడా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి మానిటరింగ్ యూనిట్లు మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల స్థాయిలో కూడా ఉండాలి. మానిటరింగ్ యూనిట్లు సమర్థవంతంగా పనిచేస్తేనే కార్యక్రమం బాగా జరుగుతుంది. స్పందన కార్యక్రమానికి అత్యంత సమర్థవంతమైన, మెరుగైన విధానమే జగనన్నకు చెబుదాం కార్యక్రమం” అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
స్పందన డేటా ప్రకారం అత్యధికంగా ఫిర్యాదులు రెవిన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, హోంశాఖ, ఆరోగ్యం–కుటుంబ సంక్షేమ శాఖల నుంచి వస్తున్నాయి. జగనన్నకు చెబుదాం ప్రారంభమైన తర్వాత కూడా ఇవే విభాగాలనుంచి వినతులు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ శాఖలకు చెందిన విభాగాధిపతులు అర్జీల పరిష్కారంపై మరింత దృష్టిపెట్టాల్సి ఉంటుంది. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై సిబ్బందికి ఓరియెంటేషన్ ఇవ్వాలి. మానిటరింగ్ యూనిట్లు ఏర్పాటుపైకూడా మార్గదర్శకాలు రూపొందించాలి. నిర్దేశిత సమయంలోగా వినతులు పరిష్కారం కావాలి. ఆ సమయంలోగా పరిష్కారం కావడం, పరిష్కారంలో నాణ్యత ఉండడం అన్నది చాలా ముఖ్యం. పరిష్కారం అయిన తర్వాత వినతులిచ్చిన వారి నుంచి లేఖ తీసుకోవాలి. పలానా అర్జీని తిరస్కరించాల్సిన నేపథ్యంలో అక్కడ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. తిరస్కరణకు గురైనా జరిగిన ప్రక్రియపై అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేసేలా ఉండాలి. అవినీతికి సంబంధించి అంశాలను అధికారులు చాలా గట్టిగా తీసుకోవాలి. పోలీసులకు వచ్చే అర్జీల పరిష్కారానికి మండల స్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలి. పోలీసులు, రెవిన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో కూడిన మండల/మున్సిపల్ స్ధాయి సమన్వయ కమిటీ ప్రతివారం సమావేశం కావాలి. ప్రభుత్వ విభాగాధిపతులు త్వరలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించి వారికీ అవగాహన కల్పించాలి” అని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE