జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఇసుక లారీ యజమానులు అక్టోబర్ 25, శుక్రవారం నాడు కలిసి తమ సమస్యలను విన్నవించారు. అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆయన విమర్శించారు. ప్రభుత్వ తీరుతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక రోడ్డున పడ్డారని చెప్పారు. కొత్త ఇసుక విధానం వస్తుందంటే సంతోషించామని, అయితే ఆ విధానం లోపభూయిష్టంగా ఉందని అన్నారు. ఇసుక కొరత ప్రభావం అన్ని వర్గాల ప్రజలపై ఉంది, భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, ఇసుక రవాణా పునరుద్ధరణ జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
రాజధాని నిర్మాణం పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. అసలు అమరావతిలో రాజధాని కడతారా? లేదా అనే విషయంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. రాయలసీమ నుంచి లాయర్లు వచ్చి కలిసారని, తమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని అడుగుతున్నారు. ఆ ప్రాంతం నుంచే ఎక్కువమంది సీఎంలుగా పనిచేసిన ఇప్పటిదాకా సమస్యలు తీరలేదని అన్నారు. మరో వైపు మంత్రి బొత్స సత్యనారాయణ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వెనుక కోట్లాదిమంది ప్రజలు ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దని అన్నారు. హైకోర్టులో టీ కూడ దొరకడంలేదు, వసతులు లేవని విమర్శలు వస్తున్న నేపథ్యంలో హైకోర్టును రాయలసీమకు తరలిస్తారా, లేదా వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత నివ్వాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే ప్రజల చేతిలో శిక్ష తప్పదని ప్రభుత్వానికి హెచ్చరిక చేసారు.
[subscribe]