ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. పశువుల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తూ, మెరుగైన వైద్యసేవలందించే దిశగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన “డా.వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ” పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.278 కోట్లతో మొత్తం 340 పశువుల అంబులెన్స్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండగా, మొదటిదశలో భాగంగా రూ.143 కోట్లతో సిద్ధం చేసిన 175 పశువుల అంబులెన్స్లు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ అంబులెన్స్లను గురువారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా డా.వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ అంబులెన్స్లలో ఉన్న సదుపాయాలను సీఎం వైఎస్ జగన్ పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు రెండో విడతలో మరో రూ.135 కోట్ల వ్యయంతో మిగిలిన 165 పశువుల అంబులెన్స్లను కూడా కొనుగోలు చేసి రాష్ట్రంలో పలు జిల్లాలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ పశువుల అంబులెన్స్లో ఒక పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్ ఉండనున్నారు. పరీక్షల చేసేందుకు చిన్న ప్రయోగశాల, వ్యాక్సిన్లు, మందులు, పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అవసరమైతే పశువులను ఈ అంబులెన్స్లో దగ్గరలోని ఏరియా పశువైద్యశాలకు తరలించి పశువుకు సరైన వైద్యం అందించి, తిరిగి ఆ పశువును రైతు ఇంటికి ఉచితంగా చేర్చనున్నారు.
ఈ సదుపాయాలను పొందేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1962 ఏర్పాటు చేశారు. పశువులు లేదా ఇతర మూగజీవాలు అనారోగ్యానికి గురైనప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ 1962 కు ఫోన్ చేసి గ్రామం వివరాలు, అనారోగ్య సమస్య వివరిస్తే, సంబంధిత సమాచారం ముందుగా రైతు భరోసా కేంద్రానికి చేరుతుంది. అక్కడ నుంచి వివరాలు అందగానే పశు వైద్య సహాయకులు ఆ ప్రాంతానికి వెళ్ళి వైద్యసేవలు అందించనున్నారు. ప్రస్తుతం దేశంలోనే ఎక్కడాలేని విధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఈ పశువుల అంబులెన్స్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అంబులెన్స్ల మెయిన్టెనెన్స్ ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరించనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF