ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 26, గురువారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రతిపాదిత మూడు రాజధానుల వ్యవహారంపై ఈ రెండు జిల్లాల నేతలతో సీఎం వైఎస్ జగన్ చర్చిస్తున్నారు. అలాగే రాజధానిపై జీఎన్రావు కమిటీ సమర్పించిన నివేదికను ఈ జిల్లాల నాయకులకు సీఎం వివరించనున్నట్టు తెలుస్తుంది. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పటినుంచి రాజధాని అమరావతి ప్రాంతం రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.
రాజధాని అంశంపై కీలక నిర్ణయం తీసుకునే విధంగా రేపు కేబినెట్ భేటీ అవుతుండడంతో, రాజధాని ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం వైఎస్ జగన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని విషయంపై అమరావతి ప్రాంత స్థానిక ప్రజాప్రతినిధులపై రైతుల నుంచి ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో అక్కడ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరో వైపు డిసెంబర్ 27, శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కాబోతుంది. ఈ కేబినెట్ సమావేశం సందర్భంగా రాజధాని రైతులు ఆందోళనలు చేపట్టే అవకాశముందని, పోలీసులు ముందస్తుగా భారీ స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదటగా మంత్రివర్గ భేటీ సచివాలయంలోనే నిర్వహించాలని భావించగా, రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ భేటీలో రాజధానిపై జీఎన్రావు కమిటీ ఇచ్చిన నివేదిక, అమరావతి కోసం భూములిచ్చిన రైతుల సమస్యలపై కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు.
[subscribe]