అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన నేపథ్యంలో వాల్టర్ రీడ్ మిలిటరీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా నాలుగు రోజుల పాటుగా చికిత్స తీసుకున్న అనంతరం సోమవారం నాడు డోనాల్డ్ ట్రంప్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి వైట్ హౌస్ కు చేరుకున్నారు. “వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్ నుండి ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు డిశ్చార్జి అవుతున్నాను. నిజంగా ఆనందంగా ఉంది. కోవిడ్-19 గురించి ఎవరూ భయపడవద్దు. మీ జీవితంలో వైరస్ ఆధిపత్యం చెలాయించేలా చేసుకోకండి. మా అడ్మినిస్ట్రేషన్ లో కొన్ని గొప్ప మందులు మరియు సమాచారాన్ని అభివృద్ధి చేసాము. 20 ఏళ్ల క్రితం కంటే కూడా ఇప్పుడు నేను చాలా బాగా ఉన్నట్టు భావిస్తున్నాను” అని ట్రంప్ ట్వీట్ చేశారు.
ఆసుపత్రి నుంచి వైట్హౌజ్కు చేరుకున్న ట్రంప్, థమ్సప్ సింబల్ చూపుతూ తాను బాగానే ఉన్నానని సంకేతాలు ఇచ్చారు. అలాగే అనంతరం మాస్కును తొలగించి ఫొటోలకు ఫోజులిచ్చారు. ట్రంప్ ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడిందని, అయితే వైద్య నిపుణల పర్యవేక్షణలో వైట్హౌజ్లో చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు. మరోవైపు త్వరలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తో జరిగే రెండో డిబేట్ లో పాల్గొనడానికి ట్రంప్ సమాయత్తమవుతున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu