తెలంగాణలో మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నవంబర్ 3 న పోలింగ్ నిర్వహించనున్నట్టు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దుబ్బాక టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని సోమవారం నాడు ప్రకటించింది. దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత పేరును టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు.
“సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారని, ఉద్యమం కోసం, పార్టీ కోసం ఎంతో అంకిత భావంతో పని చేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడి పని చేశారు. రామలింగారెడ్డి కుటుంబం యావత్తు అటు ఉద్యమంలోనూ ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాలుపంచుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో ఆ కుటుంబానికి అనుబంధం ఉంది. రామలింగారెడ్డి తలపెట్టిన నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించడానికి, నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు యధావిధిగా అమలు కావడానికి సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులే నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహించడం సమంజసం. జిల్లాలోని నాయకులందరితో సంప్రదింపులు జరిపాకే సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాము’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu