ఈరోజు వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం సమావేశం జరిగింది. అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే సమాయత్తం అవ్వాలని.. పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించాలని సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, ఇకపై ప్రతి ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉండాలి అని ఆదేశించారు. ఇంట్లో ఉంటానంటే కుదరదని, ప్రతి రోజు 3, 4 గ్రామాలను సందర్శించాలని సూచించారు. తమ నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామ సచివాలయానికి వారంలో కనీసం రెండు పర్యాయాలు అయినా వెళ్లాలని చెప్పారు.
ప్రతి నాయకుడి పనితీరుపై రోజు నివేదికను తెప్పించుకుని సమీక్షిస్తామని సీఎం జగన్ తెలిపారు. బూత్ కమిటీలను బలోపేతం చేయాలి, కమిటీల్లో సగం మంది మహిళలు ఉండేలా చూడాలన్నారు. ఏప్రిల్ నాటికి జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలని చెప్పారు. జూలై 8న ప్లీనరీ నిర్వహిస్తామని, అలాగే మంత్రివర్గాన్ని కూడా పునర్ వ్యవస్థీకరిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అలాగే, ఉగాది నుంచి వలంటీర్లకు సన్మానం చేస్తున్నామని.. వారి సేవలకు అవార్డులు ఇస్తున్నామని వెల్లడించారు. బాగా పని చేసిన వలంటీర్లను గుర్తించి వారికి పారితోషికం, మెడల్ ప్రెజెంటేషన్ వంటి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్రాల కింద అవార్డులు ఇస్తామని అన్నారు. ఏప్రిల్ 2నుంచి ఈ కార్యక్రమం నెలరోజుల పాటు కొనసాగుతుందన్నారు. తమ నియోజకవర్గాలలో ఉన్న ప్రతి ఊరికీ వెళ్లి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం జగన్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ