ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు రాష్ట్ర రాజధాని విషయంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక స్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా ఆలోచించాలని, అందులో భాగంగా రాష్ట్రానికి మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. దక్షిణాఫ్రికా లాంటి దేశంలో మూడు రాజధానులు ఉన్నాయి. అలాగే మనం కూడా అమరావతిలో శాసన నిర్వాహక, విశాఖలో కార్యనిర్వాహక, కర్నూలులో హైకోర్టు పెట్టొకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరముంది. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేసేందుకు వీలుందని చెప్పారు. వీటి కోసం మన దగ్గర డబ్బు ఉండే పరిస్థితి ఉందా? అని ఆలోచించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే అక్కడ ఇప్పటికే అన్నీ ఉన్నాయి కాబట్టి ఖర్చేమీ ఉండదని అన్నారు. రాజధానిపై ఓ కమిటీని వేశామని, ఆ కమిటీ అన్ని అంశాలపై అధ్యయనం చేస్తుందని, బహుశా వారంలోపు ఆ నివేదిక వచ్చే అవకాశముంది. నివేదిక రాగానే ఈ అంశాలపై చర్చించి రాజధానిపై మంచి నిర్ణయం తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
అసెంబ్లీలో రాజధానిపై సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాజధానిగా అమరావతి ఉండాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. అమరావతిపై వైసీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేసారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. టీడీపీ నేతలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బినామీల పేరుతో భూములు కొనే ఖర్మ టీడీపీ నేతలకు లేదని చెప్పారు. రాజధానిని ఎవరైనా 3 ప్రాంతాల్లో పెట్టాలనుకుంటారా? వైసీపీ ప్రభుత్వం తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు, తప్పుడు విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. మూడు రాజధానులు పెడితే సీఎం అమరావతిలో ఉంటారా? విశాఖపట్నంలో ఉంటారా? ఇడుపులపాయలో ఉంటారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే ప్రజలకు అనేక ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని ఇప్పటికే కోరామని, అయితే రాజధానిపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఇంకా నివేదిక ఇవ్వకముందే రాజధానిపై సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించడం ఏంటని చంద్రబాబు విమర్శించారు.
[subscribe]