ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాడు సభ మొదలైన తరువాత ముందుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అనంతరం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అంశం, ఉపాధి హామీ పనుల చెల్లింపులు, విద్యుత్ కోతలు, రాయలసీమ నీటి పారుదల ప్రాజెక్టులు, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం వంటి పలు అంశాలపై చర్చ జరిగిన సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదనలు వాడివేడిగా నడిచాయి. ఈ క్రమంలోనే రాజధాని భూముల అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి పేర్కొన్న పలు విషయాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరాలు తెలియజేస్తూ అడ్డు తగిలారు.
అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఈ అంశంపై మాట్లాడేందుకు మరింత సమయం ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సభలో చర్చకు ఆటంకం కలిగిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాంకు విజ్ఞప్తి చేశారు. దీంతో స్పీకర్ అసెంబ్లీ నుంచి 9 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. సభ నుండి సస్పెండ్ అయిన టీడీపీ సభ్యులలో అచ్చెన్నాయుడు, వీరాంజనేయస్వామి, నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మోహన్, రామకృష్ణ బాబు, సాంబశివరావు, అశోక్, అనగాని సత్యప్రసాద్, మద్దాలి గిరి ఉన్నారు. కాగా ఈ రోజే అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు కావడం విశేషం.
[subscribe]