ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో ఈడీ ఒకవైపు ఛార్జ్ షీట్లు, మరోవైపు అరెస్టులతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ తాజాగా మరో ప్రముఖ వ్యక్తిని అరెస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఈడీ ఇటీవల వేసిన తన రెండో చార్జిషీట్లో బాలాజీ గ్రూప్ సంస్థ పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. కాగా దీనికి రాఘవ యజమానిగా ఉన్నారు. దీంతో ఈ కుంభకోణంలో ఆయన ప్రమేయం కూడా ఉందంటూ ఆయన్ను ప్రశ్నించడానికి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి పిలిపించారు. ఈ క్రమంలో కొన్ని గంటలపాటు రాఘవను ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం రాఘవను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. అనంతరం ఆయనను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టును అనుమతి కోరనున్నట్లు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చి బాబును కూడా ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీలోని అధికార పార్టీ ఎంపీ కుమారుడిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇక ఇదే కేసుకు సంబంధించి తాజాగా ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో పలువురు ప్రముఖుల పేర్లను ప్రస్తావించింది. వీరిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం పేర్లు ఉండటం తీవ్ర సంచలనం కలిగించింది. అలాగే నిందితుల జాబితాలో 17 మంది పేర్లను పేర్కొంది. ఇందులో అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రా రెడ్డి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, బినోయ్ బాబు వంటి పలువురు వ్యాపారవేత్తల పేర్లు ఉన్నాయి. ఇక ఈడీ దాఖలు చేసిన ఈ సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. ఈ కేసులోని ఇతర నిందితులకు కూడా నోటీసులు జారీ చేసింది. దీంతో ముందుముందు మరిన్ని అరెస్టులు జరగొచ్చని భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE