ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీతాల పెంపు, ఉద్యోగ భద్రతపై గ్రామ, వార్డు వాలంటీర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 2.6 లక్షల మంది వాలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో గ్రామ, వార్డు వాలంటీర్లకు నెలకు రూ.5 వేల చొప్పున అందిస్తోంది జీతం కాదు. అది గౌరవ భృతి అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. వాలంటీర్ అనే పదానికి అర్థమే స్వచ్ఛందంగా సేవలు అందించడం, ఇది ఉద్యోగం కాదు స్వచ్ఛంద సేవ అని సీఎం తెలిపారు.
వాలంటీర్లకు సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖ వివరాలు:
నా ఆత్మీయ చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు…గ్రామ వాలంటీర్ల ‘జీతాలు’ పెంచాలని కొద్దిమంది డిమాండ్ చేస్తున్న విషయం నా దృషికి వచ్చింది. వాస్తవాలతో నిమిత్తం లేకుండా వారు రోడ్డెక్కారన్న వార్త ఎంతో బాధించింది. గ్రామ వాలంటీర్లుగా, వార్డు వాలంటీర్లుగా రాష్ట్రంలోని దాదాపు 2.6 లక్షల తమ్ముళ్ళు, చెల్లెమ్మలకు ఉదాత్తమయిన బాధ్యతలు అప్పగించడం జరిగింది. గత ప్రభుత్వం ప్రతి సేవకు రేటు కట్టి లంచాలు గుంజి జన్మభూమి కమిటీల వంటి వ్యవస్థతో పౌర సేవలను భ్రష్టు పట్టించిన మీదట అటువంటి వ్యవస్థను మార్చాలన్న ఆశయంతో, లంచాలు లేని, వివక్ష లేని విశ్వసనీయ పరిపాలన కోసం ప్రతి 50 ఇళ్లకు సేవాభావంతో పౌర సేవలను డోర్ డెలివరీ చేసే గొప్పదైన గ్రామ/ వార్డు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. సేవాభావం ఉన్న చెల్లెళ్ళు, తమ్ముళ్ళతో ఈ వ్యవస్థకు రూపకల్పన చేశాం. పార్టీలకు, కులమతాలకు అతీతంగా వాలంటీర్లను ఎంపిక చేశాం. మనందరి ప్రభుత్వం అందించే పథకాలన్నీ కులాలు, మతాలు, ప్రాంతాలకు మాత్రమే కాకుండా చివరకు రాజకీయాలకు కూడా అతీతంగా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వీరిని ఎంపిక చేశాం. చివరకు నాకు ఓటు వేయని వారికి కూడా, నా ప్రత్యర్థి పార్టీకి ఓటు వేసిన వారికి కూడా ఎటువంటి వివక్ష లేకుండా సమాజ హితం కోసం, ఇంటింటి మేలు కోసం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించేందుకే ప్రతి 50 ఇళ్లకు ఒకరిని వాలంటీర్ గా నియమించాం.
నా అంచనాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ 2.6 లక్షల వాలంటీర్లలో 99 శాతం మంది వాలంటీర్లు తాము చేస్తున్నది సేవ అని, అది ఉద్యోగం కాదని మనసావాచా కర్మణా నమ్మారు కాబట్టే ఆ వ్యవస్థకు మన సమాజంతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలు కూడా సలాం చేస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతి ఇల్లూ ప్రతి మనిషీ కూడా వారికి అందుకే ఆ గౌరవం ఇస్తున్నారు. ఈ ప్రజాసేవకులకు నెలకు రూ.5 వేల చొప్పున అందిస్తున్నది జీతం కాదు. అది గౌరవ భృతి. వాలంటీర్లు సేవలు అందిస్తున్నప్పుడు ఎలాంటి ప్రలోభాలకూ లొంగకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే గౌరవ భృతి ఇస్తున్నాం. ఖర్చు ఎక్కువ అయినా- దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవల డోర్ డెలివరీకి ఇంతటి ఖర్చు చేయటానికి ముందుకు రాకపోయినా- మన ప్రజలకు లంచాలు లేని, వివక్షలేని విశ్వసనీయ వ్యవస్థ అందించాలన్న ఉద్దేశంతోనే ప్రతి వాలంటీరుకు ఏడాదికి రూ.60 వేలు చొప్పున 50 ఇళ్ళకు ఒకరిని నియమిస్తూ గౌరవ భృతి అందజేస్తున్నాం. గ్రామ వాలంటీర్ల సేవలు ప్రారంభించిన సమయంలో నేను స్పష్టంగా చెప్పిన విషయాలు కానివ్వండి, మీ అందరి దగ్గర ఉన్న వాలంటీర్ల హ్యాండ్ బుక్ లో కానివ్వండి ఎటువంటి అపార్ధాలకూ, అనుమానాలకు తావు లేకుండా వాలంటీర్లను, వారికి ఇచ్చే గౌరవ భృతిని డిఫైన్ చేశాం, స్పష్టంగా చెప్పాం. ఆ హ్యాండ్ బుక్ లో ఏముందో మీరే చూడండి. లేదా ఆ రోజు నేను అన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకోండి.
హ్యాండ్ బుక్ లో నేను రాసిన సందేశంలో “ప్రతి గ్రామంలో, వార్డులో 50 ఇళ్ళకు ఒకరు చొప్పున సేవా దృక్పథం ఉన్న యువతీ యువకులను నెలకు రూ.5000 గౌరవ వేతనంతో గ్రామ వాలంటీర్ గా, వార్డు వాలంటీర్ గా నియమిస్తాం. వారు గ్రామ సచివాలయానికి, వార్డు సచివాలయానికి అనుసంధానకర్తగా ఉండి ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలు, నవ రత్నాల ద్వారా అందించే పథకాలు వంటివి ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేస్తారు. వీరికి ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు ఎక్కడైనా వచ్చేవరకు సేవా దృక్పథంతో అన్ని పథకాలూ ఇంటివద్దకే అందేలా డోర్ డెలివరీ చేస్తారు” అని స్పష్టంగా చెప్పటం జరిగింది. గ్రామ వాలంటీర్ల సేవల ప్రారంభం రోజున కూడా ఇదే విషయాన్ని చెప్పాను. ‘వాలంటీర్’ అనే పదానికి అర్ధమే “స్వచ్ఛందంగా సేవలు అందించడం” అని. ఇది ఉద్యోగం కాదు. స్వచ్ఛంద సేవ! వాలంటీర్లుగా సేవలందిస్తున్న చెల్లెమ్మలూ తమ్ముళ్ళూ ఒక్క విషయాన్ని గమనించండి. గ్రామ/వార్డు సచివాలయంలో మీరు కేవలం వారానికి మూడు రోజులు, అది కూడా మీకు వీలున్న సమయంలో మేం అందుబాటులో ఉన్నాం అని సూచిస్తూ మీరు అటెండెన్స్ ఇస్తున్నారు. అలాగే మీరు రోజుకు ఇన్ని గంటలు, వారానికి ఇన్ని రోజులు పని చేయాలన్న నిబంధనలు కూడా ఏమీ లేవు. పని ఉన్నప్పుడు మాత్రమే సేవాభావంతో ముందుకు వచ్చి పని చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల గడపగడపకు తీసుకువెళ్లేందుకు ఇలా నెలలో పని ఉన్న ఆ కొద్ది రోజులు మీ సేవలు అందిస్తున్నారు. పేదవారి ఆశీస్సులు, దీవెనలు అందుకుంటూ సంతోషంగా మీరు చేస్తున్న కార్యక్రమం ఇది. మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు, ప్రజలతో మీ ఇంటరాక్షన్ ను పెంచేందుకు, లీడర్ షిప్ క్వాలిటీస్ పెంపొందించేందుకు, ఒక మంచి వ్యవస్థను, వివక్ష లేని లంచాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు, మన వ్యవస్థలో మంచి మార్పులు తీసుకువచ్చేందుకు మీరంతా సహాయ సహకారాలు అందించాలని కూడా గతంలోనే స్పష్టం చేశాను.
సేవాభావంతో, ప్రతిఫల ఆపేక్ష లేకుండా వాలంటీర్ అనే పదానికి అర్ధం చెబుతూ మీరు ఇంత గొప్ప సేవ అందించారు కాబట్టే సామాన్యులంతా మిమ్మల్ని ఆప్తులుగా ఆత్మీయులుగా చూసుకుంటున్నారు. మీరు వాలంటీర్లుగా కాకుండా జీతాలు తీసుకుని ఇదే పని చేస్తుంటే ఇదే పేద ప్రజల్లో ఏ ఒక్కరైనా మీకు ఇటువంటి గౌరవాన్ని ఇస్తారా? ఒకసారి ఆలోచన చేయండి! స్వచ్ఛందంగా కాకుండా ఇదేపనిని మీరు జీతం కోసమే చేస్తే ఇటువంటి గౌరవాన్ని పొందగలరా? వాలంటీర్ పేరుతో మీరు చేస్తున్నది స్వచ్ఛంద సేవ అవుతుందా? గొప్పగా సేవలు అందిస్తున్న వాలంటీర్లకు సమాజం నమస్కరిస్తుంది. ప్రభుత్వమూ వారిని సత్కరిస్తుంది. అత్యుత్తమ సేవలందించినవారికి నియోజకవర్గం ప్రాతిపదికగా ఏటా ఒక రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, జేసీ సమక్షంలో శాలువా కప్పి అవార్డుగా మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని మీకు దక్కకుండా చేసేందుకు, మీకు వస్తున్న మంచి పేరును తుడిచేసేందుకు, మొత్తంగా వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేయాలన్న దుర్బుద్ధితో ఎవరు కుట్రలూ కుతంత్రాలు పన్నుతున్నారో మీకు తెలుసు. ఇలా ప్రలోభాలకు గురిచేసేవారికి, రెచ్చ గొట్టేవారికి దూరంగా ఉంటూ మీ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మీ శ్రేయోభిలాషిగా, మీ అన్నగా విజ్ఞప్తి చేస్తున్నాను అని సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ