కొన్నిరోజులుగా టమాట ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆకాశాన్నంటిన రేట్లతో టమాటలను కొనుగోలు చేసేందుకు మధ్యతరగతి ప్రజలు జంకుతున్నారు. ఇక ధరలు పెరగడం ఏమో గానీ.. దేశ వ్యాప్తంగా చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టమాట పంటకు కొందరు సెక్యూరిటీ గార్డులను కాపలాగా పెడుతున్నారు. ఇంకొందరు తుపాకుల పహారా కాస్తుండగా.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని మరీ పంటను రక్షించుకోవడం ఇటీవల కాలంలో హాట్టాపిక్గా మారింది.
ఇక టమాటా పంట దొంగతనాలు, మార్కెట్లలో టమాటాల చోరీ వంటి ఘటనలు తరచూ ఎక్కడోక చోట జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు పుట్టినరోజు వంటి శుభకార్యాలకు, పెళ్లి వేడుకలకు టమాట బాక్సులు బహుమతిగా ఇస్తున్న ఘటనలు కూడా చూస్తున్నాం. ఈ క్రమంలో దేవునికి మొక్కు చెల్లించుకునేందుకు టమాటలు ఇవ్వడం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. తాజాగా అలాంటి ఘటనే ఏపీలోని అనకాపల్లిలో చోటు చేసుకుంది.
అనకాపల్లి జిల్లా కేంద్రంలోని నూకాలమ్మ ఆలయంలో.. పట్టణానికి చెందిన అప్పారావు, మోహిని దంపతులు అమ్మవారికి ప్రస్తుతం అత్యంత విలువైన టమాటాలతో తులాభారం ఇచ్చారు. తాము అనుకున్నది జరిగితే కుమార్తె భవిష్య పేరు మీద నిలువెత్తు బంగారం అమ్మవారికి ఇస్తామని మొక్కుకున్న తల్లిదండ్రులు.. ఆ మొక్కుబడి తీర్చుకున్నారు. ఇక తాజా పరిస్థితుల దృష్ట్యా టమాటాలను సామాన్యులు బంగారంగా భావిస్తున్నారు. కాబట్టి బంగారంతో సమానమైన టమాటాల తులాభారాన్ని ప్రతిఒక్కరూ విచిత్రంగా, ఆసక్తిగా తిలకించారు.
అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్యను.. 51 కిలోల టమాటాలతో తులాభారం నిర్వహించారు. ఆ తర్వాత 51 కిలోల బెల్లంతో, అలాగే పంచదారతో తులాభారం వేసి గుడిలో అమ్మవారి నిత్యాన్నదాన కార్యక్రమం కోసం ఆలయ అధికారులకు అప్పగించారు. ఇక నూకాలమ్మ అమ్మవారి భక్తులైన దంపతులు అత్యంత భక్తి భావంతో నిర్వహించిన టమాటాల తులాభారాన్ని.. ఓ వింతగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో టమాటాల ధర కేజీ 150 రూపాయల పైనే ఉండటంతో.. అంత ఖరీదైన వాటితో తులాభారమా అంటూ ఆ నోట ఈ నోట తెగ చర్చించుకుంటున్నారు. అమ్మవారికి ఇలా కూడా తులాభారం ఇవ్వొచ్చా అని నోరెళ్లబెడుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE