ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటినుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. రేపటినుంచి పల్లె వెలుగు బస్సుల్లో మినిమం ఛార్జీ రూ. 10గా ఉండనుందని తెలిపారు. దేశవ్యాప్తంగా డీజిల్ ధరలు పెరగటం వలన రాష్ట్రంలో కూడా ఆర్టీసీ చార్జీలపై డీజిల్ సెస్ విధించినట్లు చెప్పారు. దీంతో పల్లె వెలుగు బస్సుల్లో రూ. 2 వరకు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ. 5 వరకు, అలాగే ఏసీ బస్సులలో రూ. 10 వరకు చార్జీలు పెంచినట్లు పేర్కొన్నారు. ఇక మరో ప్రధాన సమస్య అయిన చిల్లర సమస్యను అధిగమించేందుకు కనీస చార్జీ రూ. 13 ను రూ. 15 రూపాయలకు రౌండప్ చేస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. చార్జీలపై డీజిల్ సెస్ వల్ల ఆర్టీసీకి రూ.720 కోట్ల ఆదాయం రానుందని ఆయన వెల్లడించారు. ఇంధన ధర పెరిగినప్పుడల్లా మేము టిక్కెట్ ధరలను పెంచలేదు కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో పెంచక తప్పడంలేదన్నారు ఆర్టీసీ ఎండీ.
మేము ఖర్చులను తగ్గించడం మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా పరిస్థితిని ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తున్నామని, ఇక అంతర్జాతీయంగా మరియు దేశీయంగా డీజిల్ ధరల అసాధారణ పెరుగుదలతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రంలో కూడా ఆర్టీసీ ఛార్జీలను పెంచుతున్నట్లు ఈ సందర్భంగా తిరుమల రావు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో డీజిల్ ధర దాదాపు రూ.70 వద్ద ఉండగా, ప్రస్తుతం రూ.120 పైగా ఉందని, ఇంధన ధరలు దాదాపు 50% పెరిగాయని తెలిపారు. గడచిన రెండేళ్లుగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా అనేక రకాల ఆంక్షలు, లాక్ డౌన్స్ వంటి వాటివలన సంస్థ తీవ్రంగా ప్రభావితం అయిందని, అయితే రాష్ట్రంలో ఇప్పుడు ప్రజా జీవితం సాధారణ స్థితికి వచ్చినందున ప్రజలు ప్రయాణాలకు వెనుకాడటం లేదని, బస్సు కార్యకలాపాలు కూడా 100% సామర్థ్యంతో నడపబడుతున్నాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ