మహిళా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం పతకం గెలుచుకున్న పూసర్ల వెంకట (పీవీ) సింధు, ఆ తరువాత జరిగిన చైనా ఓపెన్, కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500లలో ఆశించినంతగా రాణించలేక పోయింది. ఈ నేపథ్యంలో డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో టైటిల్ యే లక్ష్యంగా బరిలోకి దిగింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఇండోనేషియా క్రీడాకారిణి గ్రెగొరీయా మరిస్కాపై 22-20, 21-18 తేడాతో విజయం సాధించి, రెండో రౌండ్ లోకి ప్రవేశించింది. ఇక అక్టోబర్ 17 గురువారం నాడు జరగనున్న రెండో రౌండ్లో దక్షిణ కొరియా క్రీడాకారిణి ఆన్ సె యంగ్ తో సింధు తలపడనుంది.
అదే విధంగా ప్రపంచ చాంపియన్షిప్లో పురుషుల సింగిల్స్ లో కాంస్య పతకం సాధించిన సాయిప్రణీత్ మరోసారి అదరగొట్టాడు. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన లిన్డాన్ను 36 నిమిషాల్లో 21-14, 21-17 తేడాతో ఓడించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఇక రెండో రౌండ్లో జపాన్ ఆటగాడు, ప్రపంచ చాంపియన్, వరల్డ్ నంబర్వన్ కెంటో మొమోటాతో తలపడే అవకాశం ఉంది. ఇక మిగిలిన భారత షట్లర్లు కశ్యప్, సౌరభ్ వర్మ ఈ డెన్మార్క్ ఓపెన్ లో తొలి రౌండ్లోనే నిష్క్రమించారు.