ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 30, శనివారం నాడు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. జగన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ వరకు అన్ని ఉన్నత విద్యలు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న వైఎస్ఆర్ నవశకం సర్వే ద్వారా విద్యార్థులకు ఫీజు రియింబర్స్మెంట్ కార్డులు జారీ చేస్తారు. ప్రభుత్వం ఇచ్చే రీయింబర్స్మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు జమచేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు. జగనన్న విద్యా దీవెన పథకం అమలుకు జిల్లా కలెక్టర్లు బాధ్యత వహించాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇక జగనన్న వసతి దీవెన పథకం కింద రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ప్రతి సంవత్సరం ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇతర ఉన్నత చదువులు చదివే వారికీ రూ.20 వేలు చెల్లించనున్నారు. వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు లోపు ఉన్న పేద కుటుంబ విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. జగనన్న వసతి దీవెన పథకానికి అర్హులైన విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలలో రెండు విడతలుగా ఈ ఆర్ధిక సహాయం జమచేయనున్నారు. ఈ రెండు పథకాలు వర్తించాలంటే విద్యార్థులకు తప్పనిసరిగా కనీసం 75 శాతం హాజరు ఉండాలి. అంతేగాక ప్రైవేటు మరియు డీమ్డ్ వర్సిటీల్లో సీట్లు పొందినవారికి, దూరవిద్య, మేనేజ్మెంట్, కరస్పాండెంట్ కోటాలో సీట్లు పొందిన వారికీ కూడా ఈ పథకాలు వర్తించవు. అర్హులైన విద్యార్థుల ఎంపిక చేపట్టాలని సంబంధింత శాఖలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
[subscribe]