అమరావతి రాజధాని నగరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదన తెస్తోంది. గతేడాది రాజధానిలోని కొన్ని గ్రామాలను తొలగించి మంగళగిరి తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అమరావతి కేపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ అనే ఆలోచన చేస్తోంది. తుళ్లూరు మండలంలోని 16 గ్రామ పంచాయతీలు, మంగళగిరి మండలంలోని మరో 3 పంచాయతీలు కలిపి కార్పొరేషన్గా ఏర్పాటు చేయబోతోన్నట్లు ప్రకటించింది. ఈ 19 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయం సేకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మార్చి 24వ తేదీన మంగళగిరి తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. అయితే, అమరావతి రాజధాని పరిధి నుంచి నిడమర్రు, నవులూరు, ఆత్మకూరు, యర్రబాలెం, బేతపూడి, ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు మినహాయింపు ఇచ్చింది. తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలతో పాటు మంగళగిరిలోని కురగల్లు, నీరుకొండ, కృష్ణాయపాలెం గ్రామాలను అమరావతి కేపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్లో చేర్చినట్లు గుంటూరు కలెక్టర్ డిసెంబరు 29నే ఆదేశాలు జారీచేశారు.
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా గ్రామసభలను.. రెవెన్యూ, పోలీసు శాఖల సమక్షంలో సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి, తీర్మాన నకళ్లతో పూర్తిస్థాయి నివేదికలను మండల పరిషత్ కార్యాలయంలో అందజేయాలని ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ