ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరణ ఇచ్చారు. జూలై నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే పరీక్షల షెడ్యూల్ ను అధికారికంగా విడుదల చేస్తామని చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తగిన విధంగా అన్ని అవసరమైన ఏర్పాట్లు చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. భౌతిక దూరం నియమాన్ని పాటిస్తూ, మాస్కులు అందజేసి విద్యార్థులు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన వివరించారు. పరీక్షల నిర్వహణలో ఒక్కో క్లాస్ రూమ్ లో కేవలం 12 మంది విద్యార్థులే పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పదో తరగతి పరీక్షలపై వస్తున్న వదంతులను, అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులకు మంత్రి సురేష్ విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu