దేశంలోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ మరియు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే అమలు చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంధన ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఆదివారం ఏపీ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ మరియు విద్యుత్ డిస్కంల సీఎండీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా విద్యుత్ శాఖకు చెందిన స్మార్ట్ మీటర్లతో సహా పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఇళ్లల్లో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నాణ్యమైన విద్యుత్ మరియు ఉత్తమ సేవలు అందుతాయని తెలిపారు. అలాగే బిల్లుల జారీలో కూడా ఖచ్చితత్వం ఉంటుందని, తద్వారా వినియోగదారులకు అధిక భారం పడదని అన్నారు. ఇక జవాబుదారీతనం ఉంటుందని, పారదర్శకత పెరుగుతుందని, దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలకు కూడా వాణిజ్యపరంగా నష్టాలు తగ్గుతాయని వివరించారు. స్మార్ట్ మీటర్లు ప్రతి 15 నిమిషాలకు లేదా గంటకు అదే సమాచారాన్ని యుటిలిటీ ప్రొవైడర్లకు ప్రసారం చేస్తాయి. స్మార్ట్ మీటర్లు ఇంటర్నెట్కు కనెక్ట్ చేయబడినందున, వారు వినియోగం గురించి వినియోగదారుకు సమాచారాన్ని పంపగలరని మంత్రి తెలిపారు.
ఇక ఇంధనశాఖ అధికారి విజయానంద్ మాట్లాడుతూ.. ఫారిన్ కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్తో కలిసి భారత ప్రభుత్వం చొరవతో ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్లను అందుబాటులోకి తీసుకురావడం గురించి రాష్ట్ర ఇంధనశాఖ అధికారులను కలిసి చర్చించినట్లు మంత్రి దృష్టికి తెచ్చారు. స్మార్ట్ మీటర్ నేషనల్ ప్రోగ్రామ్ కింద దేశవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల సంప్రదాయ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లను అమర్చాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. అలాగే కేంద్రం నివేదికల ప్రకారం ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో స్మార్ట్ మీటర్ల కోసం ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయని విజయానంద్ మంత్రికి వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY