2019–2020 నుంచి రైతులందరికీ ఉచితంగా “వైఎస్ఆర్ పంటల బీమా” అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అలాగే రైతులు వేసిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడారు. 2018–19 రబీ పంటల బీమా పరిహారం(క్లెయిమ్) చెల్లింపులకు సంబంధించి గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన నిధులతో కలిపి మొత్తం రూ.596.36 కోట్లను ఈ రోజు సీఎం విడుదల చేశారు. ఈ నిధులు 5,94,005 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి.
అలాగే ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రాలలోనే ఇ– క్రాపింగ్ నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇ–క్రాపింగ్ ద్వారా రిజిస్టర్ చేసి, వెంటనే ఇన్సూరెన్స్ను కట్టేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులు కేవలం రూపాయి కడితే చాలని, వారి తరఫున ప్రభుత్వమే ప్రీమియం కట్టి, బీమా పరిహారం పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని సీఎం పేర్కొన్నారు. పంటల బీమాను ఇ–క్రాపింగ్ తో అనుసంధానం చేయడం ద్వారా 2019 ఖరీఫ్ లో 25.73 లక్షలు, 2019–20 రబీలో 33.03 లక్షల మందితో కలిపి మొత్తం 58.76 లక్షల మందికి ఉచితంగా పంటల బీమా సౌకర్యం అందనుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu