ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు (సోమవారం, 17 అక్టోబర్, 2022) నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ నాల్గవ విడత నిధులు పంపిణీ చేశారు. తద్వారా ఒక్కొక్క రైతుకు రూ.4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50.92 లక్షల మందికి మొత్తం 2,096.04 కోట్ల రూపాయల రైతు భరోసా సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. కాగా ప్రస్తుతం ఈ పథకం కింద రైతులకు ఏటా మూడు విడతల్లో 13,500 రూపాయల సాయం ప్రభుత్వం అందిస్తోంది. ఈ క్రమంలో వరుసగా నాలుగో ఏడాది తొలి విడత సాయాన్ని మే నెలలో ఖరీఫ్కు ముందే 7,500 చొప్పున అందించగా.. నేడు రెండో విడత కింద రూ. 4,000 జమ చేశారు. ఇక వచ్చే ఏడాది ప్రారంభంలో, సంక్రాంతి పండుగ సమయంలో మూడో విడతగా మరో 2,000 సాయాన్ని అందచేయనుంది.
ఈ సందర్భంగా సీఎం జగన్ బహిరంగ వేదికపై మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి పెద్దపీట వేసిందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మేలు చేయాలన్న ఉద్దేశంతోనే వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమానికి రూపకల్పన చేశామని తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం కింద రూ. 25,971.33 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని, ఈ క్రమంలో ఒక్కో రైతు కుటుంబానికి రూ. 51,000 అందించామని,పేర్కొన్నారు. ఇక పథకం ప్రారంభించినప్పటినుంచి క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నామని, తద్వారా రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించామని వివరించారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాలోకే నగదు జమచేస్తున్నామని, ఇందులో ఎక్కడా ఎలాంటి వివక్ష లేదని వెల్లడించారు. అలాగే పట్టాలు ఉన్నవారికే కాకుండా, కౌలు రైతులకు మరియు దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్నవారికి కూడా నగదు అందిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY