ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఫిబ్రవరి 29, శనివారం నాడు టీడీపీ పార్టీ నేతలు భేటీ అయ్యారు. రెండ్రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఈ సందర్భంగా గవర్నర్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు విశాఖ పర్యటనలో చోటుచేసుకున్న పలు పరిణామాలను వారు గవర్నర్ కు వివరించారు. సుమారు ఐదు గంటల పాటు విశాఖ విమానాశ్రయం వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు, చంద్రబాబు అరెస్ట్, పోలీసుల వైఫల్యం తదితర అంశాలను తెలియజేసినట్టుగా తెలుస్తుంది. పోలీసుల యొక్క సహకారంతోనే వైసీపీ నాయకులు చంద్రబాబు పర్యటనకు అడ్డుపడ్డారని టీడీపీ నేతలు పేర్కొన్నట్టు సమాచారం. ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని కూడా గవర్నర్కు అందజేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తదితరులు ఉన్నారు.
[subscribe]