కరోనా వైరస్కు చికెన్కు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనాపై భయం వీడి, చికెన్, ఎగ్స్ తినండంటూ ప్రజలకు సూచించారు. చికెన్, కోడిగుడ్లపై జరుగుతున్న దుష్ప్రచారాలు, అపోహలను నమ్మొద్దని ప్రజలను కోరారు. నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఫిబ్రవరి 28, శుక్రవారం సాయంత్రం ఆలిండియా పౌల్ట్రీ డెవలప్మెంట్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ(నెక్), తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసొసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన చికెన్, ఎగ్ మేళా కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, సహచర మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్యాదవ్, వీ.శ్రీనివాస్గౌడ్, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇతర మంత్రులతో కలిసి చికెన్, కోడిగుడ్లును మంత్రి కేటీఆర్ ఆరగించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, కరోనా వైరస్ వార్తలతో పౌల్ట్రీ రంగం సంక్షోభంలోకి వెళ్తుందని,ఈ సందర్భంలో ప్రభుత్వం వారికీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఎగ్, చికెన్, మటన్, ఫిష్ వేటికీ కరోనాతో సంబంధం లేదని, మనం వండుకునే విధానంలో అలాంటి వైరస్లు బతకవని చెప్పారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వస్తున్న అపోహలు, వదంతులను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. వదంతులతో చికెన్ మార్కెట్ బాగా దెబ్బతిందన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరిస్తుందని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణలో ఒక్క కరోసా కేసు కూడా నమోదుకాలేదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.