తెలుగుదేశం పార్టీ 40వ వార్షికోత్సవం, ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 100వ జయంతి ఉత్సవాలసందర్భంగా.. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణంలో ‘మహానాడు’ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమవుతోంది. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు జరుగనున్న మహానాడు మొదటిరోజు కార్యక్రమానికి హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అంతటా 12,000 మంది ఎంపిక చేసిన ప్రతినిధులకు ఆహ్వానాలు అందాయి. అయితే ఆహ్వానితులే కాకుండా ఏపీలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొంటారని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. వచ్చే ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలకు ప్రాధాన్యతతో పాటు సమావేశంలో పాల్గొనే ప్రజల నుండి వచ్చే స్పందన ఆధారంగా పార్టీ భవిష్యత్తు కార్యాచరణను కూడా రూపొందించనుంది.
ఈ క్రమంలో మహానాడులో పాల్గొనడానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రమే ఒంగోలు చేరుకున్నారు. కార్యక్రమ ఏర్పాట్లపై నాయకులకు కీలక సూచనలిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు, అధికార వైసీపీ ప్రభుత్వ వైఫల్యంపై 14 తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు. అలాగే తెలంగాణకు సంబంధించిన సమస్యలపై మరో మూడు తీర్మానాలు, మొత్తం 17 తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంకా ఈ రెండు రోజులపాటు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని, ఇందులో ఆసక్తి ఉన్నవారు రక్తదానం చేయవచ్చని పార్టీ ప్రతినిధులు తెలిపారు. ఇక రెండో రోజు ఉదయం మహానాడు ప్రాంగణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టీడీపీ నాయకులు నివాళులర్పించి, మధ్యాహ్నం బహిరంగ సభ నిర్వహించనున్నారు.
అయితే మహానాడుకు వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టిస్తోందని, కానీ కార్యకర్తలు మరియు ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఘనవిజయం చేస్తామన్న నమ్మకం ఉందని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. మహానాడును ఎట్టి పరిస్థితుల్లో జయప్రదం చేయాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మహానాడుకు వచ్చే ప్రజల వాహనాల పార్కింగ్కు 40 ఎకరాలు, వీఐపీల పార్కింగ్ కోసం మరో 40 ఎకరాలు కేటాయించామని వారు తెలిపారు. పార్టీ కార్యకర్తలకు అసౌకర్యం కలగకుండా 80 ఎకరాల్లో జర్మన్ హ్యాంగర్ల కింద వేదికలు, గ్యాలరీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. శుక్రవారం నాడు మహానాడుకు హాజరయ్యే వారికి ఉదయం 5 వేల మందికి సరిపడేలా అల్పాహారం, 30 వేల మందికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ ప్రతినిధులు తెలిపారు. అలాగే 25 వేల మందికి సాయంత్రం స్నాక్స్ ఇస్తామని, ఇక 6 వేల మందికి రాత్రికి భోజనంలో రుచికరమైన శాకాహారాన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ