ఈసారి జనసేన పార్టీకి సంపూర్ణ అండదండలు అందించి ఆశీర్వదించాలని, రాష్ట్రం దశ దిశను మార్చే బాధ్యత తీసుకుంటామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు హామీ ఇచ్చారు. అవినీతి, లంచగొండితనం లేని పాలన అందిస్తామని, తప్పు చేసిన నాయకుడిని ప్రజా కోర్టులో నిలబెట్టి శిక్ష పడేలా చేస్తామని, జనసేన వైపు చూడాలని ఆయన ప్రజలను కోరారు. బాధ్యత గల వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా పంపించకపోతే రాష్ట్రం బాగుపడదని, వైసీపీకి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం సర్వ నాశనమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలన్నా, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలన్నా, కన్నీరు పెట్టని రైతాంగం ఉండాలన్నా ఒక్కసారి జనసేనకు అండగా నిలబడాలని కోరారు. ఆదివారం సాయంత్రం పర్చూరులోని ఎస్.కె.పి.ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా రచ్చబండ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సాగు భారమై బలవన్మరణానికి పాల్పడిన 74 మంది కౌలు రైతు కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శించి, ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తామని, ప్రజల కన్నీరు తుడుస్తామని 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు చెప్పారు. వాళ్లు చెప్పిన మాటలు నమ్మి మీరు కూడా వాళ్లను గెలిపించారు. వాళ్లు అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే, ఆత్మహత్యలు చేసుకున్న వారు రైతులే కాదన్నట్లు మాట్లాడుతున్నారు. ఒక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే దాదాపు 84 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడితే ఇప్పటి వరకు వాళ్లను ప్రభుత్వం గుర్తించలేదు. చనిపోయిన వాళ్లకు గుర్తింపు కార్డులు లేవని అంటోంది. కౌలు రైతులకు పాస్ పుస్తకాలు, గుర్తింపు పత్రాలు ఉండవని వ్యవసాయం తెలిసిన అందరికీ తెలుసు ఒక్క ముఖ్యమంత్రికి తప్ప” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
దసరా నుంచి ప్రజా సమస్యలపై రోడ్లు మీదే ఉంటాం:
“2024 సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనవి. రాష్ట్ర భవిష్యత్ ను నిర్ధారించే ఎన్నికలు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్తాం. అధికారంలోకి రాగానే యువతకు రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తాం. తమ సొంత కాళ్ల మీద వాళ్లు నిలబడేలా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల రుణం అందిస్తాం. ఎలా ఇస్తారని మీరు అడగొచ్చు. కొంతమంది అవినీతి నాయకులు లక్ష కోట్లు ప్రజాధనం తినేసినప్పుడు యువతకు ఎందుకు రూ.10 వేల కోట్లు పంచలేం. అన్నం పెట్టే రైతు కన్నీరు తుడిచేలా చర్యలు తీసుకుంటాం. వ్యవసాయం గిట్టుబాటు కాదు లాభసాటి అయ్యేలా మారుస్తాం. దసరా నుంచి ప్రజా సమస్యలపై రోడ్లు మీదే ఉంటాం. ఈ సారి నిండు మనసుతో జనసేన పార్టీకి అండగా నిలవాలి” అని పవన్ కళ్యాణ్ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY