త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తుంది. అద్దె ప్రాతిపదికన 350 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఏపీఎస్ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఆ సంస్థ ఈ రోజు ఫ్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించింది. పలు సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. 12 సంవత్సరాల కాల పరిమితితో గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిన ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్టీసీ టెండర్లు పిలిచింది. రన్నింగ్ కిలోమీటర్ల ప్రాతిపదికన చెల్లింపులు విధానమే అనుసరించనున్నట్టు తెలిపారు. అక్టోబర్ 14లోగా టెక్నికల్ బిడ్లు వేయాలని, నవంబర్ 1న ఫైనాన్షియల్ బిడ్, నవంబర్ 6న రివర్స్ బిడ్డింగ్కు వెళ్లాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు ప్రస్తుతం రవాణా శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న కృష్ణబాబుకు ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా రాష్ట్రప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించగా, ఆయన ఈ రోజు ఆర్టీసీ భవన్ లో ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఆర్టీసీని గొప్ప సంస్థగా నిలపాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటానని చెప్పారు. ఆర్టీసీ విలీన ప్రక్రియపై వచ్చే జనవరి ఒకటో తేదీని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది సుమారు 1000 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తుందని, ప్రస్తుతానికి 350 బస్సులకు టెండర్లు పిలిచామని అన్నారు. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 1800 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్టు పేర్కొన్నారు.
[subscribe]