హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్ష పదవికి నేడు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైంది, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహించబడుతుంది. పోలింగ్ అనంతరం సాయంత్రం 5 గంటలకు ఫలితాలు ప్రకటించనున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ హెచ్సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ముఖ్యంగా ప్రకాష్చంద్ జైన్, దిలీప్ కుమార్ కూడ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఇక ఉపాధ్యక్ష పదవి కోసం సర్దార్ దల్దీత్ సింగ్, జాన్ మనోజ్ రేసులో ఉన్నారు.
ఈ హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికలలో మొత్తం 227 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేలా సన్నాహాలు చేసారు. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు జి.వివేక్ వెంకటస్వామి అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్ ను తిరస్కరించడంతో ఆయన అజారుద్దీన్ కి వ్యతిరేకంగా ప్రకాష్చంద్ జైన్ ప్యానెల్ కు మద్ధతు తెలుపుతున్నారు. 2017లో ఒకసారి అజారుద్దీన్ హెచ్సీఏ అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్ తిరస్కరించడంతో ఈసారి ఆయన గెలుపుకోసం పూర్తి కసరత్తు చేసి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో అంతర్జాతీయ స్థాయిలో ఆడిన పలువురు హైదరాబాద్ క్రికెట్ క్రీడాకారులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.