ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికకు జూన్ 23న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ పేరును బీజేపీ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ ఉపఎన్నిక కోసం మే 30న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, అదే రోజు నుంచి నామినేష్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. జూన్ 6తో నామినేషన్ల దాఖలకు గడువు ముగియనుంది. కాగా బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ నేడు (జూన్ 4, శనివారం) నామినేషన్ దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పలువురు బీజేపీ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు ట్వీట్ చేస్తూ, “ఆత్మకూరు ఉపఎన్నిక అభ్యర్థిగా భరత్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నాను. బీసీ వర్గానికి చెందిన భరత్ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ మీ అందరి సంపూర్ణ మద్దతు, తోడ్పాటును అందించాలని ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలను కోరి ప్రార్ధిస్తున్నాను” అని పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్రెడ్డి బరిలో నిలిచారు. కాగా మృతి చెందిన ఎమ్మెల్యే కుటుంబసభ్యుడికే వైఎస్సార్సీపీ టికెట్ కేటాయించిన నేపథ్యంలో సంప్రదాయాలను గౌరవిస్తూ ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF