ఏపీ రాజ్భవన్లో సోమవారం ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఇరువురూ హాజరయ్యారు. అయితే ఒకే కార్యక్రమంలో పాల్గొన్నా కూడా వీరిద్దరి మధ్యా ఎలాంటి పలకరింపులు లేకపోవడం విశేషం. దాదాపు గంటపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఇరువురు నేతలు చెరోవైపు తమకు కేటాయించిన స్థానాల్లోనే కూర్చుండిపోయారు. కాగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాత్రం హాజరైన అతిథుల వద్దకు వెళ్లి స్వయంగా వెళ్లి పలకరించారు. ఇక ఈ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు సహా పలువురు మంత్రులు, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.
ఇక సీఎం జగన్ తన సతీమణి వైఎస్ భారతి రెడ్డితో కలిసి హాజరవగా, ప్రతిపక్షనేత వెంట ఆయన పార్టీ నేతలు కె. అచ్చెన్నాయుడు, ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ పి.అశోక్బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు. ఈ క్రమంలో ముందుగా ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రాగా గవర్నర్ సాదరంగా ఆహ్వానించారు. ఆయన తమకు కేటాయించిన టేబుల్ వద్ద పార్టీ నాయకులతో ఆసీనులయ్యారు. అనంతరం కొద్దిసేపటికి రాజ్భవన్ చేరుకున్న సీఎం జగన్ దంపతులకు గవర్నర్ దంపతులు ఎదురెళ్లి స్వాగతం పలికారు. అయితే వేదికకు ఒకవైపు సీఎం జగన్ కూర్చుంటే, మరోవైపు చంద్రబాబు కూర్చున్నారు. గతంలో 2020లో గవర్నర్ ఆతిథ్యం ఇచ్చిన ‘ఎట్ హోమ్’కి చంద్రబాబు హాజరు కాలేదు. కాగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని రాజ్భవన్లో ‘ఎట్ హోమ్’ నిర్వహించడం ఇది రెండోసారి. కరోనా మహమ్మారి కారణంగా 2021లో ఈ ఈవెంట్ను నిర్వహించడం సాధ్యం కాలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY