మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్లోని కాపు సంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం జూలై 9 న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి కాపులకు రిజర్వేషన్స్ కల్పించాలని కోరుతూ బహిరంగ లేఖ రాసారు. ఈ లేఖలో ముద్రగడ కాపు సమాజానికి సంబంధించిన సమస్యల గురించి ప్రస్తావించి, కాపు రిజర్వేషన్లు ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న సమస్యను అని, త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో గెలవడం కొరకు, టిడిపి అధినేత చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని, అది నమ్మి కాపులంతా టిడిపి అధికారంలోకి రావడానికి పోరాడితే, తెదేపా ప్రభుత్వం ఎటువంటి న్యాయం చెయ్యలేదని లేఖలో వివరించారు.
అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన పది శాతం రిజర్వేషన్స్ లో, సగం కాపులకు ఇస్తామంటూ అసెంబ్లీ లో బిల్లు పెట్టి, తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకున్నారని చంద్రబాబు ని విమర్శించారు. రాష్ట్రంలో తహసీల్దార్ కార్యాలయాల్లో కాపులు బీసీ సర్టిఫికెట్స్ అడుగుతుంటే, అధికారులు తిరస్కరిస్తున్నారని, చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని కాపులు గ్రహించారని లేఖలో పేర్కొన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో కాపు సమాజం అంతా , చంద్రబాబు మోసాన్ని గుర్తించి వైఎస్ఆర్సిపి కి ఓటు వేశారని, పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడిందని, ముఖ్యమంత్రి గా జగన్ మోహన్ రెడ్డి కాపు సమాజానికి న్యాయం చేయాలని ఆశించారు.