ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 22, గురువారం నాడు రెండో ఏడాది “వైఎస్ఆర్ కాపు నేస్తం” పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా 3,27,244 మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.490.86 కోట్ల ఆర్ధిక సాయాన్ని జమ చేశారు. ముందుగా వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య గల కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల జీవనోపాధిని మెరుగుపర్చేలా ఏడాదికి రూ.15 వేల చొప్పున, ఐదేళ్లలో రూ.75 వేల ఆర్ధిక సాయాన్ని అందించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా గత ఏడాది 3,27,349 మంది మహిళల ఖాతాల్లో రూ.491.02 కోట్లు జమ చేయగా, రెండో ఏడాది కింద నేడు 3,27,244 మంది మహిళలకు రూ.490.86 కోట్లు జమచేశారు. దీంతో ఇప్పటివరకు వైఎస్ఆర్ కాపు నేస్తం కింద రాష్ట్రప్రభుత్వం రూ.981.88 కోట్లను అందజేసినట్లు అయింది.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. నిరుపేదలగా ఉన్న కాపు మహిళలకు ఆర్థిక స్వావలంబన రావాలనే ఉద్దేశంతో వరుసగా రెండో ఏడాది కూడా వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అమలు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 3,27,244 మంది కాపు మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్ ఇన్కమ్బర్డ్ ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. అర్హత ఉండి కాపు నేస్తం రాని వారు ఎవరైనా ఉంటే ఆందోళన చెందకుండా, మళ్ళీ గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ