ఏపీలో జనసేన, బీజేపీ,టీడీపీ కూటమి చాలా బలంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో నర్సాపురం ఒకటిగా చెబుతారు. పైగా ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సొంత ప్రాంతం కావడంతో..2019 ఎన్నికలలో పవన్తో పాటు నాగబాబు కూడా ఇక్కడ నుంచే పోటీ చేశారు. నాగబాబు నరసాపురం పార్లమెంటు బరిలో దిగగా.. పవన్ కళ్యాణ్ మాత్రం భీమవరం అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో.. కూటమి చాలా బలంగా కనిపిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ నుంచి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ.. వైఎస్సార్సీపీ నుంచి భీమవరం పట్టణానికి చెందిన అడ్వకేట్ గూడూరి ఉమాబాల బరిలో దిగుతున్నారు. వీరిద్దరూ కూడా గతంలో భీమవరం మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా పని చేసిన వారే కావడం విశేషం.
అయితే నరసాపురం పార్లమెంటు సీటు నుంచి బీజేపీకి గతంలో గెలిచిన అనుభవం ఉంది. ఇద్దరు అభ్యర్థులు కూడా ఇప్పుడు తొలిసారి అసెంబ్లీకి కాకుండా ఏకంగా పార్లమెంటుకు పోటీ చేయడం ఆసక్తిని రేపుతోంది. శ్రీనివాస్ వర్మ క్షత్రియ సమాజ వర్గానికి చెందిన అభ్యర్థి కాగా.. ఉమాబాల బీసీలలో బలమైన శెట్టిబలిజ వర్గానికి చెందిన అభ్యర్ధి.
పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో పాలకొల్లులో తెలుగు దేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. తణుకులో తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఆచంటలో తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, నరసాపురం నుంచి జనసేన నుంచి బరిలో దిగుతున్న బొమ్మిడి నాయకర్ ఏకపక్ష విజయాలు సాధిస్తారన్న అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
భీమవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్కు విపరీతమైన నెగిటివిటీ పెరిగిపోవడంతో.. తెలుగు దేశం పార్టీ నుంచి జనసేనలో చేరి పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు గట్టి పోటీ ఇస్తుండటంతో.. జనసేనకే ఎడ్జ్ ఉందని స్థానికులు సైతం అంటున్నారు. ఇక తాడేపల్లిగూడెంలో అయితే కచ్చితంగా జనసేన నుంచి పోటీ చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ గెలుస్తారనే అనుకున్నారు కాకపోతే తాజాగా మంత్రి కొట్టు సత్యనారాయణ గట్టి పోటీ ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఉండిలో మాత్రం ముక్కోణపు పోటీ నెలకొనడంతో కూటమి గెలుపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి రఘురామ కృష్ణరాజు పోటీ చేస్తుంటే..టీడీపీ రెబల్.. మాజీ ఎమ్మెల్యే కలువపూడి శివ ఇండిపెండెంట్గా బరిలో ఉండటం రఘురామకు పెద్ద మైనస్ గా మారింది. కాకపోతే శివ కచ్చితంగా ఇక్కడ 25 వేల ఓట్లతో రెండో ప్లేస్ లో ఉంటారన్న అంచనాలు ఉన్నాయి. ఈ ముక్కోణపు పోటీలో వైఎస్సీర్సీపీ లాభపడుతుందా లేదా మూడో స్థానానికి పరిమితం అవుతుందా అనేది అంచనాలకి కూడా అందటం లేదు.ఏది ఏమైనా పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మొత్తంగా చూస్తే జగన్ చేసిన బీసీ మహిళా అభ్యర్థి ప్రయోగం పెద్దగా ఫలించే పరిస్థితి లేదని విశ్లేషకులు అంటున్నారు. భారతీయ జనతా పార్టీకే ఇక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అటు చాలా సర్వేలు కూడా చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY