టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు ఈ రోజు ఉదయం అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తన నివాసంలో ఆయన్ని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు విజయవాడకు తరలించినట్టుగా సమాచారం. రాష్ట్రంలో వెలుగుచూసిన ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడుపై వచ్చిన ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తులో భాగంగా ఈ అరెస్ట్ జరిగినట్టు తెలుస్తుంది.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఈఎస్ఐ ఆసుపత్రుల్లో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు వెలుగుచూడడంతో వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తుకు ఆదేశించింది. విచారణ అనంతరం ఈఎస్ఐకు సంబంధించి కొనుగోళ్లలో రూ.900 కోట్లకు పైగా భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కొన్నిరోజుల క్రితమే ఓ నివేదికను విడుదల చేసింది. పెద్ద ఎత్తున నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో విచారణలో భాగంగా అచ్చెన్నాయుడు అరెస్ట్ చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu