తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 10, బుధవారం సాయంత్రం 5 గంటల నుండి జూన్ 11, గురువారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 209 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. ఈ కేసుల్లో రాష్ట్రానికి చెందిన వారు 208 మంది ఉండగా, ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన 209 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4320 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం కరోనా బాధితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య 449 కి చేరింది . అలాగే కొత్తగా నమోదైన 9 మరణాలతో కలిపి ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 165 కి పెరిగినట్టు తెలిపారు.
కొత్తగా రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఏరియాలో 175 కేసులు, మేడ్చల్ లో 10, రంగారెడ్డి జిల్లాలో 7, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలలో 3 కేసుల చొప్పున, వరంగల్ అర్బన్, ఆసిఫాబాద్, సిద్ధిపేట జిల్లాలలో 2 కేసులు చొప్పున, ములుగు, కామారెడ్డి, వరంగల్ రూరల్, సిరిసిల్ల జిల్లాలలో ఒక్కోకేసు చొప్పున మొత్తం 208 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. కాగా ఇప్పటికే ఈ వైరస్ నుంచి కోలుకుని 1993 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2162 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu