దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ నవంబర్ 16, శనివారం నాడు ఏలూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. అయితే జైలు నుంచి విడుదలయ్యాక ఎటువంటి ర్యాలీలు నిర్వహించొద్దని చింతమనేని అనుచరులకు పోలీసులు ఆంక్షలు విధిస్తూ నోటీసులు జారీ చేశారు. ఏలూరు నుంచి చింతమనేని స్వగ్రామమైన దుగ్గిరాల వెళ్లే మార్గంలో పోలీసులు మోహరించారు. చింతమనేని ప్రభాకర్ ను సెప్టెంబర్ 11న దుగ్గిరాలలోని ఆయన నివాసంలోనే పోలీసులు అరెస్ట్ చేసారు, అనంతరం ఆయన్ను రిమాండ్ మీద ఏలూరు జైలుకు తరలించారు.
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై మొత్తంగా 18 కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్ 11న మొదటగా ఆయనను పోలీసులు అరెస్టు చేయగా, ఆ తర్వాత పీటీ వారెంట్పై మరో 17 కేసుల్లో అరెస్టు చేస్తూ రిమాండ్ కు తరలిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటగా 14 కేసుల్లో బెయిల్ రాగా, నవంబర్ 15, శుక్రవారంనాడు మరో నాలుగు కేసుల్లో కూడ బెయిల్ మంజూరు అయింది. 66 రోజుల పాటు ఏలూరు జైల్లో ఉన్న చింతమనేని ఈ రోజు విడుదలయ్యారు. చింతమనేని జైలులో ఉన్నప్పుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆయన్ను పరామర్శించి, రాజకీయ దురుద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతూ చింతమనేనిపై అక్రమ కేసులు పెడుతుందని విమర్శించారు. పలువురు సీనియర్ టీడీపీ నాయకులు చింతమనేనిని జైలులో కలుసుకుని పరామర్శించారు.
[subscribe]