ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో.. రోజురోజుకూ పాలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సమావేశాల నిర్వహించడానికి వైసీపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఫిబ్రవరి నెల 5వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవనున్నాయి. దీనికి సంబంధించి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 5 న ఉదయం పది గంటలకు ఉభయసభలు ప్రారంభమవుతున్నాయి.
మొదటి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత సభ వాయిదా పడనుంది. సభ వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వయిజరీ కమిటీ.. బీఏసీ సమావేశం జరగనుంది. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే విషయంపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఎలక్షన్స్ ముందు జరుగుతున్న సమావేశాలు అవడంతో ఇప్పుడు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి ఆరో తేదీన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే పిబ్రవరి ఏడో తేదీన బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు కొన్ని బిల్లులను ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది . ఈ సమావేశాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగే చివరివి కావడంతో వైసీపీ, టీడీపీ ఈ అసెంబ్లీ సమావేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.
ఐదేళ్లలో జరిగిన అభివృద్దిని అసెంబ్లీ సాక్షిగా మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అధికార పార్టీ ప్రయత్నించబోతోంది . ఇక సమావేశాలకు చంద్రబాబు తప్ప మిగిలిన టీడీపీ సభ్యులు హాజరు కానున్నారు. సభలో లేవనెత్తాల్సిన చర్చించే విషయాలపై ఫిబ్రవరి 4న సాయంత్రం టీడీపీ నేషనల్ ఆఫీసులో లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా అంశం, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయం గురించి సభలో లేవనెత్తాలని చర్చించనున్నారు. మొత్తంగా ఈ చివరి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE