తెలంగాణ పీసీసీ పదవిపై గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై తరచుగా స్పందిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు. పీసీసీ పదవి ఇస్తే పార్టీ కోసం పూర్తి స్తాయిలో పనిచేస్తానని, అంతేగాక 2023లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. నవంబర్ 16, శనివారం నాడు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ పీసీసీ పదవిని ఆశిస్తున్నానని, తన బయోడేటాను ఢిల్లీలోని పార్టీ పెద్దలకు పంపినట్లు తెలిపారు. నవంబర్ 20 తరువాత ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలుసుకుని పదవిపై చర్చిస్తానని చెప్పారు.
హక్కుల సాధన కోసం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఏర్పాటు చేసారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి చేస్తారని ప్రజలు రెండోసారి ఎన్నుకున్నారు, అయితే ఈ ప్రభుత్వం సమస్యలను జటిలం చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను అర్ధం చేసుకుని ప్రజలు వారికీ మద్దతు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు నవంబర్ 19న చేపట్టబోయే సడక్ బంద్ను విజయవంతం చేయాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. సడక్ బంద్ సందర్భంగా సంగారెడ్డిలో హైవేని దిగ్బంధం చేస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు.
[subscribe]