ఏపీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. త్వరలోనే షెడ్యూల్ ప్రకటనకు ఈసీ సన్నద్ధం అవుతోంది. రాజకీయ పార్టీలూ గెలుపు కోసం వ్యూహాలు పన్నడంలో బిజీబిజీగా గడుపుతున్నాయి. ఈ క్రమంలోనే దూకుడు మరింత పెంచాలని అధికార పార్టీ తీవ్రమైన స్థాయిలో కసరత్తు చేస్తోంది. సర్వేల పేరుతో వెలువడుతున్న కొన్ని ఫలితాలు, సోషల్మీడియాలోనూ అధికార పార్టీ ప్రాభవం తగ్గుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ అప్రమత్తమైంది. అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్యలతో తరచూ చర్చిస్తూ పార్టీ బలోపేతం కృషి చేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేసిన సంక్షేమ పథకాలను, ఇచ్చిన ఉద్యోగాలను తదితర అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
ఇప్పటికే వైసీపీ సోషల్మీడియా టీం అదే పనిలో ఉంది. మరోవైపు పార్టీ నేతలు కూడా గడపగడపకూ తిరుగుతూ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలకు తోడు, 2.6లక్షల మంది వలంటీర్ల నియామకం, రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78కి పెంపు, ప్రతీ జిల్లాలో దిశ పీఎస్లను ఏర్పాటు, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, 1000 పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఐబీ విధానం, వినూత్న పద్దతుల ద్వారా విద్యాబోధన సులభతరం, రూ.3,367కోట్లతో 47లక్ష మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక, 99.81 శాతం పాఠశాలల్లో కనీస మౌళిక సదుపాయాలు, జగన్నన గోరుముద్ద కోసం రూ.1910కోట్లు ఖర్చు.. తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
ప్రచారంలో దూకుడు పెంచకపోతే ప్రమాదం పొంచి ఉందని ఆ పార్టీ కూడా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పు, నాయకత్వ పటిష్టతపై దృష్టి సారించిన వైసీపీ నాయకులు ప్రభుత్వం చేపట్టిన పథకాల వివరాలతో ప్రజలను కలుస్తున్నారు. ప్రధానంగా విద్య, వైద్య రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై దృష్టి సారించారు. పూర్ణ పోషణం పథకం ద్వారా గర్బిణులకు మేలు, 34లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా 9.52,925 ట్యాబ్స్, రూ.11901 కోట్లతో జగనన్న విద్యాదీవెన, రూ.4267కోట్లతో జగనన్న వసతీ దీవెన ద్వారా ఇప్పటి వరకు 52లక్షల మందికి లబ్ధి, డ్రాప్ అవుట్ శాతం 20.37 నుంచి 6.62 శాతాని తగ్గింపు, విదేశీ విద్యాదీవెన కింద 1858 మందికి ప్రయోజనం చేకూర్చినట్లు, ప్రపంచంలోని 50 ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థులకు సాయం అందించామని చెప్పుకుంటున్నారు.
వైద్య రంగంలోనూ గణనీయమైన అభివృద్ధి చేశామంటూ ప్రచారం చేయడంపై దృష్టి సారించారు. బోధనా ఆస్పత్రులకు 16,852 కోట్లు ఖర్చు చేసిన చెబుతూ.. నిర్విరామగా 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఫ్యామిలీ డాక్టర్ పేరుతో వినూత్న కార్యక్రమం, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25లక్షలకు పెంపు, ఆరోగ్యశ్రీ పరిధిలో వ్యాధులను 3,257కు పెంపు, 2019-23 మధ్య ఆరోగ్యశ్రీ ద్వారా 35.91లక్షల మందికి లబ్ది, కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం, కిడ్నీ బాధితుల కోసం జనసేన అధినేత గతంలో పెట్టిన డిమాండ్లో ఒకటైన పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, జగనన్న ఆరోగ్య సురక్ష కింద 10,754 శిబిరాలు, కోటీ 67లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు, 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్భంది నియామకం.. తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
వ్యవసాయం, విద్యుత్, ఉపాధి తదితర రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలను, బీసీలకు 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు, బీసీ సంక్షేమం కోసం రూ.71,170 కోట్లను వెచ్చించినట్లుగా ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. చేసిన పనులను చెప్పుకోవడం ద్వారా పార్టీ మైలేజీని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈనేపథ్యంలో వైసీపీ నేతలు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. మరి వారి కష్టం ఎంత వరకూ ఫలిస్తుందో, చేసిన పనులను ఎంత వరకు ప్రజలు విశ్వసిస్తారో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE